Viral video : భూప్రకంపనలు... ఇల్లు షేక్ అవుతోన్న కూల్గా రాహుల్... నో టెన్షన్...
ఉత్తర భారతదేశంలో శుక్రవారం(ఫిబ్రవరి 12) చోటు చేసుకున్న భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా నోయిడా,గుర్గావ్,ఫరీదాబాద్,ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో... అలాగే పంజాబ్,రాజస్తాన్,జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో జూమ్ లైవ్లో ఓ వీడియో కాన్ఫరెన్స్కి హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... భూప్రకంపనలు తెలుస్తున్నప్పటికీ ఏమాత్రం ఆందోళన చెందలేదు. కూర్చొన్న కుర్చీలోనే తన పనిలో తాను నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం రాజస్తాన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ... శుక్రవారం రాత్రి యూనివర్సిటీ ఆఫ్ చికాగో విద్యార్థులతో జూమ్ లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు సంభవించాయి. రాజస్తాన్లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించడంతో రాహుల్ ఉన్న ఇల్లు కూడా కొద్దిగా షేక్ అయింది. ఇదే విషయంపై జూమ్ లైవ్ సెషన్లో స్పందించిన రాహుల్... 'బహుశా భూకంపం అనుకుంటా.. నా గది మొత్తం షేక్ అవుతోంది..' అని నవ్వుతూ పేర్కొన్నారు. ఆ వెంటనే ఆ విషయానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి తాను మాట్లాడుతున్న అంశంలోకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ నెటిజన్ దీనిపై ట్విట్టర్లో స్పందిస్తూ... 'రాహుల్ నిన్న పార్లమెంటులో ప్రసంగించారు.. ఆ ఎఫెక్ట్ అనుకుంటా.. ఇవాళ ఇండియా అంతా భూప్రకంపనలు...' అని వ్యాఖ్యానించాడు.
#earthquake @RahulGandhi in between in a live interview when earthquake happened.#earthquake pic.twitter.com/GRp9sxHoMY
— Rohit Yadav (@RohitnVicky) February 12, 2021
కాగా,తజకిస్తాన్లో సంభవించిన భూకంపం ఎఫెక్ట్ ఉత్తర భారత్పై పడింది. దీంతో ఉత్తర భారత్లోని చాలాచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. తజకిస్తాన్లోని ముర్గాబ్ నగరానికి పశ్చిమంగా 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం... భూకంపం... భూ ఉపరితలానికి 92 కిలోమీటర్ల లోతున ఏర్పడింది.