బీఫ్ తినండి.. ఫెస్టివల్ ఎందుకు?: కుండబద్దలు కొట్టిన వెంకయ్యనాయుడు
ముంబై: దేశంలో 'బీఫ్' నిషేధం అశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ అంశంపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. బీఫ్ తినాలని ఎవరైనా అనుకుంటే తినొచ్చని, అయితే ఇందుకోసం ఫెస్టివల్ నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
సోమవారం ఆర్ఎ పొద్దార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. ''మీరు బీఫ్ తినాలనుకుంటున్నారా.. తినండి. దానికి మళ్లీ ఫెస్టివల్స్ ఎందుకు? అలాగే 'కిస్ ఫెస్టివల్' వ్యవహారం కూడా. మీరు ముద్దు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి.. అది కేవలం మీకు మాత్రమే సంబంధించిన వ్యవహారం. అందుకు ఇతరుల అనుమతి అవసరమా? మళ్లీ దాన్ని కూడా ఏదో ఫెస్టివల్లా జరుపుకోవడమెందుకు?'' అని ఆయన నిలదీశారు.
పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు గురించి ప్రస్తావిస్తూ.. ''ఇక కొందరు అఫ్జల్ గురు జపం చేస్తున్నారు. అతనేం చేశాడో తెలుసా? మన పార్లమెంటు భవనాన్నే పేల్చేసే ప్రయత్నం చేశాడు..'' అని వెంకయ్య అన్నారు.
ఇప్పుడే కాదు, గతంలోనూ బీఫ్ అంశంపై వెంకయ్యనాయుడు స్పందించిన సందర్భాలున్నాయి. తినడం అనేది వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించినదని, ఒక వ్యక్తి నాన్-వెజిటేరియన్ అయితే అతడేం తినాలి, ఏం తినకూడదనేది ఎవరూ అతడికి చెప్పజాలరని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.