ఎబోలా వైరస్ వ్యాధి దండయాత్ర: హెల్త్ ఎమర్జెన్సీ
న్యూయార్క్: ‘ఎబోలా‘వైరస్ వ్యాధి ప్రపంచం మీదకు దండయాత్ర ప్రారంభించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇది శరవేగంగా విస్తరిస్తున్నట్లు చెబుతున్నారు. వందలాది మంది మృత్యువాత పడితే, వేలాది మందిలో వ్యాధి లక్షణాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగానే నియంత్రణ, ఔషధ తయారీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
పశ్చిమ ఆప్రికాలో దీన్ని గుర్తించారు. దీంతో పశ్చిమ ఆఫ్రికాలో ఇప్పటికే 930 మంది మరణించినట్లు చెబుతున్నారు. లైబీరియాలో ఎమర్జెన్సీ అమల్లోకి రాగా, నైజీరియా ‘ఆరోగ్యం' విషమించకుండా డబ్ల్యూహెచ్వో చర్యలు ప్రారంభించింది. మరోవైపు ఔషధ తయారీ ప్రయత్నాలను అమెరికా పెంచింది. ఎబోలా పీడిత దేశాల్లోని జవాన్లు సహా వేలాది మంది భారతీయులను స్వదేశానికి పిలిపించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రాణాంతక వైరస్ని నియంత్రించడంలో భాగంగా కొన్ని పౌర హక్కులనూ నియంత్రించాల్సి వస్తోందని లైబీరియా దేశ అధ్యక్షుడు జాన్సన్ ప్రకటించారు. ఎబోలా పట్ల ప్రజల్లో నెలకొన్న ఉదాసీనత వల్లనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తున్నట్టు సమాచారం. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మిగతా వారికి దూరంగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు వారిని తరలించాలి. కానీ, చాలా మంది ఈ ఆదేశాలను పాటించడం లేదు. వ్యాధిగ్రస్తులను తమతోనే ఉంచుకుంటున్నారు.
దేశంలో మరణాల తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు నైజీరియాలో పరిస్థితి చెయ్యి దాటిపోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. అత్యధిక జనాభా కలిగిన ఈ పశ్చిమాఫ్రికా దేశంలో ఇప్పటికే ఏడుగురు మృతి చెందారు. ఇంత జన సాంద్రత కలిగిన చోట ఎబోలా విరుచుకుపడటం ప్రారంభమైతే పరిమాణాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని డబ్ల్యూహెచ్వో కలవరపడుతోంది.