ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ కు ఎన్ని కష్టాలో! ఓటు వేయలేకపోయిన రాహుల్ ద్రవిడ్
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ రాహుల్ ద్రవిడ్.. ఈ సారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు వేయండి.. అంటూ కర్ణాటక ఎన్నికల కమిషన్ తరఫున అనేక ప్రకటనల్లో నటించిన రాహుల్ ద్రవిండ్.. స్వయంగా ఓటు వేయలేకపోతున్నారు. దీనికి కారణం- ఓటరు జాబితాలో ఆయన పేరు లేకపోవడమే. రాహుల్ ద్రవిడ్ తో పాటు ఆయన భార్య పేరు కూడా ఓటరు జాబితాలో లేదు.
2017లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్.. కన్నడిగుడైన రాహుల్ ద్రవిడ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. దీనికి సంబంధించి రాహుల్ ద్రవిడ్ పలు ఫొటో షూట్ లల్లో పాల్గొన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచడం, ప్రతి ఒక్కరిలో ఓటు హక్కు పట్ల చైతన్యం కలిగించడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలను కర్ణాటక ఎన్నికల కమిషన్ చేపట్టింది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. రాహుల్ ద్రవిడ్ పోస్టర్లను కర్ణాటక వ్యాప్తంగా పంపిణీ చేసింది.
'మీ ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్నిగెలిపించండి' అనే నినాదంతో ద్రవిడ్ ఫొటోతో కూడిన పోస్టర్లు కర్ణాటకలో దర్శనమిస్తున్నాయి. తీరా పోలింగ్ సమీపించే సమయానికి స్వయంగా ద్రవిడే తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. అసలు ఆయన పేరే ఓటరు జాబితాలో లేదు. సాంకేతిక కారణాల వల్ల ద్రవిడ్, ఆయన భార్య విజేత పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చడానికి కుదర్లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
గతంలో ద్రవిడ్ కుటుంబం బెంగళూరు సెంట్రల్ పరిధిలోని ఇందిరానగర్లో నివాసం ఉండేవారు. గత ఏడాది తండ్రి మరణానంతరం ద్రవిడ్ ఇందిరానగర్ నుంచి బెంగళూరు నార్త్లోని అశ్వర్థ నగర్ ఇంటిని మార్చారు. దీన్ని అధికారికంగా బెంగళూరు మహానగర పాలికె అధికారులకు తెలియజేశారు. దీనితో వారు ఇందిరానగర్ ఓటరు జాబితా నుంచి ద్రవిడ్, ఆయన భార్య పేర్లను తొలగించారు. అశ్వర్థ నగర్ లో నివాసం ఏర్పరచుకునే సమయానికి ఓటరు తుది జాబితా తయారైంది.
ఓటరు జాబితాలో కొత్తగా పేరును చేర్చుకోవడానికి వీలు కుదరలేదు. అదే సమయంలో- ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 16 వరకు అధికారులు ప్రత్యేకంగా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంలో ద్రవిడ్ ఫాం 6ను అధికారులకు సమర్పించలేదు. ఫలితంగా- ద్రవిడ్, ఆయన భార్య విజేత పేర్లను ఓటరు జాబితాలో చేర్చలేదు. అశ్వర్థ నగర్ లో ద్రవిడ్ ఇంటిని మార్చిన తరువాత తమ సిబ్బంది.. పలుమార్లు అక్కడికి వెళ్లారని, ఆ సమయంలో ద్రవిడ్ ఇంట్లో లేరని మత్తికెరె ఎన్నికల రిటర్నింగ్ అధికారి రూప తెలిపారు. అన్నారు. కుటుంబ సభ్యులను సంప్రదించగా.. స్పెయిన్ లో ఉన్నట్లు తేలిందని ఆమె చెప్పారు.