ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి మోడీ ఫోటో తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశం .. ఎందుకంటే
దేశంలో నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కరోనా వైరస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి ఇస్తున్న సర్టిఫికెట్ నుండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోటోను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఫోటో తొలగింపుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారు, 60 ఏళ్ల వయసు పైబడిన వారు రెండోదశలో టీకాలను తీసుకుంటున్నారు.
వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో మోడీ ఫోటో ... ఎన్నికల రాష్ట్రాల్లో అభ్యంతరం
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తున్న ప్రభుత్వం ఎలాంటి గందరగోళం లేకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ నమోదుతో పాటుగా, వ్యాక్సిన్ తీసుకున్నవారికి సర్టిఫికెట్ అందిస్తోంది. అయితే ఈ సర్టిఫికెట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోటో ఉండడం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో అభ్యంతరంగా మారింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఈ వారంలో రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల అధికారి నుండి మొదట ఎన్నికల సంఘం ఒక నివేదికను కోరింది.
ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తృణమూల్ కాంగ్రెస్ .. మోడీ ఫోటో తొలగింపుకు డిమాండ్
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ, బెంగాల్ అధికార పార్టీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంపిణీ చేసిన టీకా సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలను ఉంచడం పై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాత్కాలిక ధృవీకరణ పత్రాలపై తన ఫోటోను, పేరు మరియు సందేశాన్ని ఉంచడం ద్వారా, మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని , కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిదారుల నుండి క్రెడిట్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల సంఘం తప్పనిసరిగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల రాష్ట్రాల్లో కేంద్రాన్ని మోడీ ఫోటో తొలగించాలని ఆదేశించిన ఎన్నికల సంఘం
దీంతో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పై ఫోటోలను తొలగించాలని ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలుస్తుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో టీకా సర్టిఫికెట్లలో ప్రధాని మోడీ ఫోటో కనిపించకుండా ఉండటానికి ఒక విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వానికి తెలిపింది. అయితే ధృవపత్రాలు ఇతర రాష్ట్రాల్లో పీఎం మోడీ ఫోటోలతోనే ఇస్తారని తెలుస్తుంది.
నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న చోటే మోడీ ఫోటో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి తొలగించనున్నారు .
నాలుగు రాష్ట్రాలు , ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మార్చి 27 నుంచి ప్రారంభం ఎన్నికలు
మార్చి 27 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి లలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17 , ఏప్రిల్ 22, ఏప్రిల్ 26 మరియు ఏప్రిల్ 29 లలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6 న తమిళనాడు మరియు కేరళ ఒకే రౌండ్లో ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరిలో కూడా అదే రోజు ఎన్నికల నిర్వహణ కొనసాగనుంది. అస్సాం మార్చి 27, ఏప్రిల్ 1 మరియు ఏప్రిల్ 6 న మూడు దశల్లో ఓటు వేయనుంది.