రాజీవ్ అవినీతిపరుడన్న వ్యాఖ్యల్లో తప్పులేదు! మోడీకి మరో క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ..!
ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి వరుస క్లీన్ చిట్లు వస్తున్నాయి. తాజాగా రాజీవ్గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయన కోడ్ ఉల్లంఘించలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీపై చేసిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని గంటల్లోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ప్రధానికి గర్వభంగం తప్పదు!మోడీని దుర్యోధనుడితో పోల్చిన ప్రియాంక!
కోడ్ ఉల్లంఘించలేదు
రాజీవ్గాంధీ అవినీతిపరుడంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం మోడీకి ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఏ నియమాలను ఆయన ఉల్లంఘించలేదని అభిప్రాయపడింది. ఈ కారణంగా మోడీపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో కలుపుకుని మోడీకి ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఇచ్చిన క్లీన్ చిట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది.
ఈసీ తీరుపై సుప్రీంకు వెళ్లిన కాంగ్రెస్
అంతకు ముందు ప్రధాని నరేంద్రమోడీ విషయంలో ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. మోడీ కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన పలు ఫిర్యాదులతో పాటు ఈసీ ఆర్డర్ కాపీలను దానికి జత చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండానే ఎన్నికల సంఘం ఏకపక్షంగా క్లీన్ చిట్లు ఇస్తోందని పిటీషన్లో ఆరోపించారు. కొన్ని ఫిర్యాదుల విషయంలో చట్టాన్ని అతిక్రమించి ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన కొన్ని గంటలకే ఎన్నికల కమిషన్ మరోసారి మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం.
రాజీవ్గాంధీ అవినీతిపరుడన్న మోడీ
గత శనివారం యూపీలోని ప్రతాప్ఘడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోడీ.. రాహుల్పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడుగా జీవితాన్ని ముగించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ కామెంట్లపై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, మోడీ కోసం కర్మఫలం ఎదురు చూస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తన తండ్రిపై విమర్శలు చేసిన మోడీపై ప్రియాంకగాంధీ సైతం ఫైర్ అయ్యారు. దుర్యోధనుడిలాగే ప్రధాని నరేంద్రమోడీకి తప్పదని గర్వభంగం తప్పదని అన్నారు.