మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తనిఖీలు: హెలిప్యాడ్ వద్దకు వెళ్లి మరీ..సోదా చేసిన అధికారులు!
బెంగళూరు: కర్ణాటకలో తనిఖీల వ్యవహారం మరోసారి ప్రకంపనలు రేపింది. ఓ వైపు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు, మరోవైపు ఎన్నికల సిబ్బంది తనిఖీలతో రాజకీయ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానున్న నేపథ్యంలో.. పెద్ద ఎత్తున దాడులు, తనిఖీలు చోటు చేసుకోవడాన్ని రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెల్లవారు జామునే ఐటీ అధికారుల దాడులు మిగిల్చిన వేడి చల్లారక ముందే- ఎన్నికల అధికారులు మంట పుట్టించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ లో తనిఖీలు చేయడంతో దీని తీవ్రత పతాక స్థాయికి చేరుకున్నట్టయింది. అధికారంలో ఉన్న జనతాదళ్ (సెక్యులర్) కూటమి నాయకుల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్న తరుణంలో.. ఎన్నికల అధికారులు రంగంలో దిగడం కలకలం సృష్టించింది.
కదిలిన డేటా డొంక: ఆధార్ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం
హెలిప్యాడ్ వద్దకు వెళ్లి..హెలికాప్టర్ ను ఆపేసి!
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన సొంత జిల్లా శివమొగ్గలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం- మంగళవారం ఉదయం ఆయన బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంది. దీనికోసం ఆయన శివమొగ్గ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరుకు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో యడ్యూరప్ప తన వెంట కొన్ని బ్యాగులను తీసుకెళ్లడానికి సిద్ధపడ్డారు. శివమొగ్గలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ పైకి ఎగరడానికి సిద్ధపడిన తరుణంలో.. హుటాహుటిన కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృంద అధికారులు అక్కడికి చేరుకున్నారు. యడ్యూరప్పను సంప్రదించారు. బ్యాగులను తనిఖీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన సరే అనడంతో..హెలికాప్టర్ లో ఎక్కించిన బ్యాగులన్నింటినీ కిందికి దించి, మరీ సోదా చేశారు ఫ్లయింగ్ స్క్వాడ్ బృంద అధికారులు.
#WATCH Election Commission flying squad checks luggage of former Karnataka Chief Minister and BJP leader BS Yeddyurappa at helipad in Shivamogga, Karnataka pic.twitter.com/uZAdRCA5sO
— ANI (@ANI) April 16, 2019
ఇదివరకు ముఖ్యమంత్రి కుమారస్వామి కారును ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కారును కూడా వదల్లేదు. జేడీఎస్ అభ్యర్థిగా తుమకూరు లోక్ సభ నుంచి పోటీ చేస్తోన్న దేవేగౌడ కారులో ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. దీనిపై కర్ణాటకలో విమర్శలు చెలరేగాయి. ఐటీ అధికారులు, ఎన్నికల సిబ్బంది కేవలం జేడీఎస్ నాయకులను టార్గెట్ గా చేసుకున్నారని, బీజేపీ నేతల ఇళ్లపై ఎందుకు దాడులు చేయట్లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారు..
ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న హెలికాప్టర్ లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలావుండగా- రెండోదశ సందర్భంగా గురువారం కర్ణాటకలో పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాల కోసం పోలింగ్ నిర్వహించబోతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.