ఈసీ సంచలనం: సీఎం మమతపై 24 గంటల నిషేధం -అసాధారణ స్థాయికి బెంగాల్ ఎన్నికల పోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోన్న వ్యవహారం ముదిరిపాకన పడింది. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపైనే వేటు వేసింది. దీదీ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఒకరోజు పాటు ఆమె ఎలాంటి ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. సోమవారం రాత్రి 8 నుంచి 24 గంటల పాటు మమత ఎన్నికల ప్రచారం చేపట్టవద్దని ఆదేశించింది..
నిషేధం ఎందుకంటే..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ భారీ కుట్రలు చేస్తున్నదని, కేంద్ర బలగాల ద్వారా కుట్రలను అమలు చేస్తున్నదని బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత తొలి నుంచీ ఆరోపిస్తున్నారు. ఇప్పటికి జరిగిన నాలుగు విడతల పోలింగ్ లో కేంద్ర బలగాలు బీజేపీ ఏజెంట్లుగా పనిచేశారని, ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని మమత ఆరోపించారు. ఒక దశలో 'కేంద్ర బలగాలను తరిమేయండి..''అని కూడా ఆమె పిలుపునిచ్చారు. తాగాజా ఈనెల 10న నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బెహార్ లో ఘోర కాల్పుల సంఘటన జరిగింది. మమత వ్యాఖ్యలే కాల్పులకు దారి తీశాయని ఈసీ భావించడంతో ఆమెపై చర్యలకు ఉపక్రమించింది..
మోదీకి తొత్తుగా ఈసీ..
కూచ్ బెహార్ కాల్పుల ఘటనలో నలుగురు పౌరుల్ని కేంద్ర బలగాలు కాల్చేయడాన్ని తప్పుపడుతూ అటు కేంద్రం, ఇటు ఈసీపై మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాలీలను చంపాలన్న ఉద్దేశంతోనే కేంద్రం బలగాలను దింపిందని, ఎన్నికల కమిషన్ మోదీకి తొత్తు అన్న చందంగా వ్యవహరిస్తున్నది, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను కాస్తా మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్ గా ఈసీ మార్చేసిందని దీదీ దుయ్యబట్టారు. కాగా, మొత్తం హింసాత్మక పరిణామాలకు ఆమెనే బాధ్యురాలని బీజేపీ ఎదురుదాడి చేసింది. ఇప్పుడు ఈసీ సైతం మమతనే తప్పు పడుతూ ఆమె ప్రచారంపై 24 గంటలు నిషేధం విధించింది. కాగా,
ఈసీపై దీదీ గుస్సా.. ధర్నా
బీహార్ లో ఎన్నికల హింస, ప్రత్యేకించి కూచ్ బెహార్ కాల్పుల ఘటనకు తనను బాధ్యురాలిని చేస్తూ ప్రచారంపై 24 గంటల నిషేధం విధించిన ఎన్నికల సంఘం తీరుపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. తనపై నిషేధం కొనసాగే మంగళవారం నాడే ఆమె ధర్నాకు దిగనున్నారు. ఈసీ తీరుకు వ్యతిరేకంగా దీదీ ధర్నా చేస్తారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ఏప్రిల్ 17న జరుగనుంది.