రైల్వే శాఖపై ఎన్నికల సంఘం సీరియస్... నోటీసులు జారీ
న్యూఢిల్లీ: టీ కప్పులపై ప్రధాని నరేంద్ర మోడీ స్లోగన్ మై భీ చౌకీదార్ ఉండటాన్ని ఆక్షేపించింది ఎన్నికల సంఘం. రైళ్లలో టీ అమ్ముతుంటే అందుకు వినియోగిస్తున్న టీ కప్పులపై ఇలాంటి స్లోగన్లు ఉండరాదని అది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలుపుతూ రైల్వేశాఖకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇస్తూ నివేదిక సమర్పించాలని రైల్వే శాఖకు పంపిన నోటీసుల్లో పేర్కొంది ఎన్నికల సంఘం. శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దీన్ని ఫోటో తీసి ట్విటర్లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ పోస్టు వైరల్గా మారింది.
ఇంట్రెస్టింగ్: ఎన్నికల వేళ వీరి ఓటు బ్యాంకు పార్టీలకు అక్కర్లేదా..?
ఇదిలా ఉంటే ఆ కప్పులను తొలగించామని రైల్వే శాఖ తెలిపింది. అంతేకాదు ఆ కాంట్రాక్టరుపై చర్యలు కూడా తీసుకున్నామని వెల్లడించింది. ఇక రైల్వే టికెట్లపై కూడా మోడీ ఫోటోను తీసేయాల్సిందిగా సీరియస్గా హెచ్చరించడమే కాదు... పోల్కోడ్ను సీరియస్గా తీసుకోవడం లేదని రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్లోగన్లు రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చే టీ కప్పులపై ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
ఇక రైల్వే టికెట్లపై మోడీ ఫోటోను వెంటనే తొలగించాలని సీరియస్ అయ్యింది ఎన్నికల సంఘం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రైల్వే శాఖ ఈ విషయాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ప్రశ్నించింది. ఇందుకు బాధ్యుడైన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రైల్వేశాఖకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. ఒక వారం సమయంలో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే రైల్వే శాఖ ఈసీ పంపించిన నోటీసులపై ఇంకా స్పందించలేదు.