పీఎం నరేంద్రమోడిని చూసిన ఈసీ ప్రతినిధులు
ఢిల్లీ : ప్రధాని మోడీ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ చిత్రం విడుదలపై ఎలక్షన్ కమిషన్ ఈ నెల 19న నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ప్రతినిధులు బుధవారం సినిమా చూశారు. చిత్రంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నందున రెండు రోజుల సమయంపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈసీ ప్రతినిధులు చర్చించుకున్న అనంతరం పీఎం నరేంద్రమోడీ చిత్రం విడుదలపై నిషేధాన్ని కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని తెలుపనుంది. ఏప్రిల్ 19న సుప్రీంకోర్టులో సీల్డ్ కవర్లో రిపోర్టు సమర్పించనుంది.
పీఎం నరేంద్రమోడీ చిత్రం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందన్న కారణంతో ఎలక్షన్ కమిషన్ ఆ చిత్రం విడుదలపై నిషేధం విధించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్ చేయొద్దని స్పష్టం చేసింది. ఈసీ ఉత్తర్వులపై చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం సినిమా చూసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పీఎం నరేంద్రమోడీ చిత్రాన్ని చూసిన ఈసీ ప్రతినిధులు ఏప్రిల్ 19న సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో తమ నిర్ణయాన్ని తెలుపనున్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 22న ఎన్నికల సంఘం రిపోర్టును పరిశీలించి తీర్పు వెలువరించనుంది.