కర్ణాటకలో 15 స్థానాలకు ఉపఎన్నికల తేదీ ప్రకటించిన ఈసీ
బెంగళూరు: కర్ణాటకలోని 15 శాసనసభ నియోజకవర్గాల ఉపఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. డిసెంబర్ 5న 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
నవంబర్ 11 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నవంబర్ 19న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 21 వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చింది.
డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
ఈ క్రమంలో ఈ స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అక్టోబర్ 21 నుంచే ఉప ఎన్నికలు జరుగుతాయని భావించినప్పటికీ ఎన్నికల సంఘం ఈ డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
అథాని, గొకక్, యల్లపుపూర్, హోసకొటే, శివాజీనగర్, కృష్ణరాజ్ పేట్, హున్సూర్, కగ్వాల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఇంతకుముందు ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.