కరోనాలో ఎన్నికలకు ఈసీ కొత్త రూల్స్- ఆన్లైన్ నామినేషన్లు- రోగులకు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన మార్గదర్శాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇకపై ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల్లో కరోనా రోగులతో పాటు వృద్ధులకూ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. అలాగే ఆన్లైన్లో నామినేషన్లను స్వీకరించనున్నారు.
వీటితో పాటు పలు కొత్త నిబంధనలను ఈసీ తమ మార్దదర్శకాల్లో పొందుపరించింది. కరోనా సమయంలో సాధారణ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం స్ఫష్టం చేసింది. దీంతో ఇప్పటివరకూ కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు తొలగిపోయాయి.
కరోనాలో ఎన్నికలు.. ఈసీ కొత్త రూల్స్..
కరోనా ప్రభావం మొదలయ్యాక ఏపీ సహా పలు రాష్ట్రాల్లో స్ధానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. కానీ అది సాధ్యం కాదు కాబట్టి మధ్యేమార్గంగా కేంద్ర ఎన్నికల సంఘం పలు జాగ్రత్తలతో ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు, ఓటర్లు ఈ కొత్త మార్దదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల అధికారుల చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఆన్లైన్ నామినేషన్లు, పోస్టల్ బ్యాలెట్లు..
ఈసీ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు.ఇకపై నేరుగా నామినేషన్ కేంద్రాలకు రాకుండానే ఆన్లైన్లో నామినేషన్లు వేసుకోవచ్చు. అఫిడవిట్తో పాటు ఇతర నిబంధనలు అన్నీ యథావిధిగా అమల్లో ఉంటాయి. అలాగే కోవిడ్ రోగులకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకూ, వికలాంగులకూ, కోవిడ్ సేవల్లో ఉన్న అత్యవసర సిబ్బందికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించారు. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ హక్కు కల్పించడం దేశంలో ఇదే ప్రథమం. ఇప్పటివరకూ సైనిక దళాల్లో పనిచేసే వారికి, ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉండేది..
కత్తి మీద సాములా బీహార్ ఎన్నికలు..
త్వరలో జరగాల్సిన బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ప్రస్తుతం బీహార్లో లక్షకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 574 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్ధితుల్లో బీహార్ వంటి రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణ ఈసీకి కత్తిమీద సాముగా చెప్పవచ్చు. అయితే తాజా మార్గదర్శకాలను పాటిస్తే మాత్రం ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. బీహార్ అసెంబ్లీకి ముగుస్తున్న గడువు దృష్ట్యా అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఎన్నికలు తప్పనిసరి కానున్నాయి. ఈ మేరకు ఈ నెల 20న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. వీటి నిర్వహణలో సఫలమైతే ఇతర రాష్ట్రాల ఎన్నికలకూ, ఉప ఎన్నికలకూ ఈసీ సిద్ధం కానుంది.
ప్రచారంలోనూ ఆంక్షలు...
బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అభ్యర్ధి తన నామినేషన్ కోసం చెల్లించే మొత్తం ఆన్లైన్ చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రచారం కోసం కేవలం ఐదుగురిని మాత్రమే వెంటబెట్టుకుని తిరగాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనల ప్రకారం బహిరంగసభలు, రోడ్షోలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. భౌతిక దూరం పాటిస్తూనే అభ్యర్ధులు ప్రచారం నిర్వహించుకోవాలి. అలాగే మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్లు, పీపీఈ కిట్లు కూడా తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుందని ఈసీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.