ఒకే దేశం-ఒకే ఎన్నిక: జమిలి ఎన్నికలకు ఈసీ సిద్ధం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు ఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) సిద్ధంగా ఉందని సీఈసీ ఓపీ రావత్ వెల్లడించారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు ఉండాలని వివిధ పార్టీలు కోరుకుంటున్న విషయం తెలిసిందే.
కేంద్రం, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీ యోచిస్తున్నారు. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు పార్లమెంటు కసరత్తు కూడా ప్రారంభించింది.
ఈ నెల 22న నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాల గురించి విపక్షాలకు వినిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కమిటీకి నేతృత్వం వహించిన బీజేపీ ఎంపీ భూపీంద్ర యాదవ్ చెప్పారు.
సోమవారం జరిగిన సమావేశంలో ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. జమిలి ఎన్నికల వల్ల అటు సమయం, ఇటు వ్యయం ఆదా అవుతాయని ప్రభుత్వం అభిప్రాయపడటంతో వారు అంగీకరించారు. ఈ ఆలోచనకు జేడీయూ, బీజేడీ అనుకూలంగా ఉన్నాయి. జమిలీ ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.