గుజరాత్ పోలింగ్: ఈవీఎంలకు బ్లూటూత్ లు పెట్టారు, కాంగ్రెస్, షాక్ ఇచ్చిన ఈసీ!
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ హోరా హోరీగా జరుగుతోంది. సూరత్, తాపి, రాజ్కోట్, బోతాడ్లలో అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కచ్, డాంగ్స్, నర్మదా ప్రాంతాల్లో ఓటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రలోని 89 శాసన సభ నియోజక వర్గాల్లో తొలి దశ పోలింగ్ జరుతోంది.
కాంగ్రెస్ ఆరోపణలు!
గుజరాత్ శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో ఈవీఎం యంత్రాలను ఉపయోగిస్తున్న బీజేపీ ట్యాంపరింగ్ చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్జున్ మోధ్వాడియా భారత ఎన్నికల సంఘానికి ఈ విషయంపై శనివారం మద్యాహ్నం ఫిర్యాదు చేశారు.
ఈవీఎంలకు బ్లూటూత్, వైఫ్ అమర్చారు!
పోర్ బందర్ లోని శారదా మందిర్ లోని బూత్ నెంబర్ 145, 146, 147ల్లోని ఈవీఎం యంత్రాలకు బ్లూటూత్, వైఫై పరికరాలు అమర్చి ట్యాపరింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అర్జున్ మోధ్వాడియా భారత ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్
ఈవీఎంలకు బ్లూటూత్ అమర్చారనే ఆరోపణలపై సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మాట్లాడుతూ ఈవీఎంలు సక్రమంగా పని చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, వాటిని తక్షణమే సరిదిద్దాలని, బ్లూటూత్, వైఫై పరికరాలు అమర్చారా అనే విషయం దర్యాప్తు చేచించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కు ఈసీ ఝలక్!
గుజరాత్ శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి భారత ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. పోర్ బందర్ పోలింగ్ బూత్ ల దగ్గర ఎన్నికల కమిషన్ అధికారులు, ఇంజనీర్లు, జిల్లా కలెక్టర్ ఈవీఎంలు పరిశీలించి దర్యాప్తు చేశారు.
ఎలా సాధ్యం అవుతుంది?
ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై పరికరాలను అమర్చడం సాధ్యం కాదని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను భారత ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఆరోపణలు ఎవరైనా చేయగలరని, దానిని నిరూపించాలని భారత ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది.
బీఇఎల్ తరపున మేం చెబుతున్నాం!
ఈవీఎంలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లూటూత్, వై ఫై పరికరాలను అమర్చడానికి, అనుసంధానం చేయ్యడానికి అవకాశం ఉండదని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఇఎల్) తరపున తాము చెబుతున్నామని భారత ఎన్నికల కమిషన్ వివరించింది.
స్వయంగా జిల్లా కలెక్టర్ వెళ్లారు
పోర్ బందర్ పోలింగ్ బూత్ కేంద్రాల దగ్గరకు స్వయంగా జిల్లా కలెక్టర్, ఇంజినీర్లు వెళ్లి పరిశీలించి దర్యాప్తు చేశారు. ఈవీఎం ఇంజినీర్లతో చర్చించిన తరువాత ఎలాంటి బ్లూటూత్ లు అమర్చలేదు అనే విషయాన్ని తాము చెబుతున్నామని భారత ఎన్నికల కమిషన్ వివరించింది.