ముంగర్లో చల్లారని హింస: ఎస్పీని విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం
ముంగర్లో మరోసారి హింస చెలరేగింది. బసుదేవ్పూర్ పోలీసు పోస్టుకు కొందరు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ముంగర్లో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీని విధుల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.
సోమవారం దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు అవుట్ పోస్టును కూడా దహనం చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద చాలా మంది జనం గుమిగూడి విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాల అద్దాలు పగులగొట్టి సారై మండి వద్ద రోడ్డుపై టైర్లు వేసి మంట పెట్టారు. సమీపంలో గల న్యాయమూర్తి బంగ్లా వద్ద జనం రాళ్ళు రువ్వినట్టు తెలుస్తోంది.
దుర్గామాత నిమజ్జనం రోజు రాత్రి జరిగిన హింసాకాండలో గాయపడిన వారిలో ఒక చిన్నారి మరణించినట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ముంగర్లో పరిస్థితి మరింత దిగజారిందని ఏడీజీ జితేంద్ర కుమార్ తెలిపారు. సోమవారం నాటి ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంగర్ ఎస్పీని ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది.
ముంగర్లో గల దీన్దయాల్ ఉపాధ్యాయ చౌక్ వద్ద సోమవారం రాత్రి దేవీ విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో భక్తులు-పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితి చేజారకుండా చూశారు. ఈ ఘర్షణలో ఒకరు చనిపోగా దాదాపు 20 మంది పోలీసులు గాయపట్లు వార్తలు వచ్చాయి.