వెల్లూరు లోక్సభ ఎన్నికలు రద్దా?.. కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటోంది?
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్సభ ఎన్నికల నిర్వహణపై సోమవారం (15.04.2019) నాడు విభిన్న కథనాలు వచ్చాయి. అక్కడ భారీగా నగదు దొరకడంతో ఎన్నికలు రద్దవుతాయంటూ వార్తలొచ్చాయి. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందనేది వాటి సారాంశం. అంతేకాదు రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్లు కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చింది సీఈసీ.
0001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 9999
ఎన్నికల వేళ కోట్లు..!
గత నెల 30వ తేదీన డీఎంకే నేత దురై మురుగన్ ఇంటి నుంచి లెక్కలు లేని 10 లక్షల 50 వేల రూపాయల నగదు సీజ్ చేశారు ఐటీ అధికారులు. ఈ సంఘటన జరిగిన రెండు మూడు రోజులకే మరో నేతకు సంబంధించిన సిమెంట్ గోడౌన్ లో 11 కోట్ల 53 లక్షల నగదు లభ్యమైంది. అయితే ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం చర్చానీయాంశమైంది. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టడానికే ఈ డబ్బు సమకూర్చారనే ఆరోపణలొచ్చాయి.
తప్పుడు అఫిడవిట్
అదలావుంటే వేలూరు నుంచి బరిలో నిలిచిన డీఎంకే నేత దురై మురుగన్ కుమారుడు ఆనంద్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారట. అయితే భారీగా నగదు దొరకడం, ఆనంద్ తప్పుడు సమాచారం ఇవ్వడం.. అలా వీటన్నింటి నేపథ్యంలో వెల్లూరు లోక్సభ ఎన్నికల రద్దుకు సిఫార్సు చేస్తూ.. రాష్ట్రపతికి సీఈసీ లేఖ రాసినట్లు సోమవారం నాడు వార్తలొచ్చాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.
ఎన్నికల రద్దు లేనట్లేనా?
రెండో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈనెల 18వ తేదీన వెల్లూరు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ ఎలక్షన్స్ జరిగేలా లేవంటూ వచ్చిన వార్తల్ని తోసిపుచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల రద్దుపై ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని స్పష్టం చేసింది. అయితే 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడటంతో కొన్ని స్థానాల్లో ఎన్నికలు రద్దు చేశారు.