విశాల్ నామినేషన్లో వీడియో ట్విస్ట్: సంతకాలపై ఈసి ఇలా...
చెన్నై: తమిళ హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం మరో మలుపు తిరిగింది. విశాల్పై చర్యలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. విశాల్పై లిఖితపూర్వక ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని చెప్పింది.
Recommended Video
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో స్థానిక ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరిగే విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు.
ఇద్దరు అడ్డం తిరిగారు....
ఆర్కె నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు విశాల్ను నామినేట్ చేస్తూ సంతకం చేసిన పది మంది స్థానిక ఓటర్లలో దీపన్, సుమతి అనే ఇద్దరు అడ్డం తిరిగారు. విశాల్ నామినేషన్ పత్రాల్లో తాము సంతకం చేయలేదనీ, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని వారరు ఎన్నికల కమిషనర్ ముందు చెప్పారు.
కమిషనర్ ఇలా చెప్పారు...
విశాల్ నామినేషన్ పత్రాలపై సంతకం చేయలేదని దీపన్, సుమతిలు స్పష్టం చేశారనీ, దీనికి సంబంధించిన వీడియో ఉందని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అంటే విశాల్ సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్ దాఖలు చేసినట్టు తేలిందన్నారు. అందువల్ల ఆయనపై లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
నేనేం అలా చెప్పలేదు...
ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నానని ప్రకటించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని విశాల్ చెప్పారు. ఈ ఉపఎన్నికలో తన మద్దతు ఎవరికి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఎవరి ప్రోద్బలం కూడా లేదు..
ఆర్కె నగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని తాను తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరి ప్రోద్బలం లేదని విశాల్ చెప్పారు.. ఆర్కే నగర్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని నామినేషన్ వేసినట్లు తెలిపారు. అయితే, పవర్ పాలిటిక్స్ తన నామినేషన్ వల్ల తన నామినేషన్ తిరస్కరణకు గురైంది చెప్పారు. ప్పటివరకు తాను చేసిన పోరాటంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.
రాజకీయ ప్రవేశంపై త్వరలో ప్రకటన..
తాను రాజకీయాల్లో పాత్ర పోషించే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తానని విశాల్ తెలిపారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైనది జాలర్ల జీవనాధార సమస్య అని ఆయన అన్నారు.. తమ జీవనాధారం కోసం గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న కన్నియకుమారి జిల్లా కుళచ్చల్ జాలర్లను వెంటనే కలుసుకుని, వారి మనోవేదనను ఆలకించాలని ఆయన కోరారు. జాలర్ల సమస్యను పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు.