ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా: 4.30పీఎం
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీలను ఈ సమావేశంలో ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.
పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందే కూలిన ప్రభుత్వం
ఈ నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం పలువురు ఎమ్మెల్యేల రాజీనామాతో మైనార్టీలో పడిపోయింది. దీంతో చేసేదేం లేక ముఖ్యమంత్రి నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించింది.
నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు
ఏప్రిల్-మే నెలల్లో పశ్చిమబెంగాల్, తిమిళనాడు, కేరళ, అస్సాంతోపాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా, తమిళనాడులో 234, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమబెంగాల్పైనే అందరి దృష్టి..
అయితే, నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశం ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే.. ఇక్కడ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఈసారి ఇంటికి పంపిస్తామంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పోటాపోటీగా ప్రచారం చేస్తోంది. టీఎంసీలోని పలువురు కీలక నేతలు ఇప్పటికే బీజేపీలోకి చేరిపోయారు. గత రెండుసార్లు కూడా సునాయాసంగా అసెంబ్లీ ఎన్నికలు గెలుపొందిన మమతకు ఇప్పుడు బీజేపీ రూపంలో గట్టి సవాల్ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమబెంగాల్లో లా అండ్ ఆర్డర్పై ఈసీ ఫోకస్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఘర్షణలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దాడులు, బాంబు దాడులతో రాష్ట్రంలో కొంత ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఇటీవల ఓ మంత్రి బాంబు దాడిలో గాయపడటం గమనార్హం. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురికావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గట్టి చర్యలు చేపట్టనుంది. భారీ భద్రత నడుము పశ్చిమబెంగాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.