మళ్లీ ఎన్నికల వేడి: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు ..ఆన్లైన్లో పార్లమెంట్ సమావేశాలు..?
న్యూఢిల్లీ: గత మూడునెలలుగా కరోనావైరస్ కారణంగా లాక్డౌన్లోకి వెళ్లిపోయిన దేశం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక కార్యకలాపాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కరోనావైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు ఆన్లైన్లోకి వెళ్లిపోగా... తాజాగా ఇక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కూడా ఆన్లైన్లో జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని సమావేశాలను కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానే నిర్వహిస్తూ వస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతుండగా మరోవైపు కరోనావైరస్ కూడా విజృంభిస్తుండటంతో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓంబిర్లాలు పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కొత్త సమావేశాలను మనము చూడబోతున్నామా ..?
Recommended Video
కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!
ఆన్లైన్లో పార్లమెంటు సమావేశాలు
కరోనావైరస్ కారణంగా బడ్జెట్ సమావేశాలు సైతం అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి పార్లమెంటు సమావేశాలు జరగలేదు. ఒక్క పార్లమెంటు సమావేశాలు మాత్రమే కాదు.. ఆయా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా కరోనా కారణంగా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ చాలావరకు సడలింపులు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల నిర్వహణపై దృష్టి సారిస్తోంది. శీతాకాల సమావేశాల నిర్వహణకు సమయం దగ్గర పడుతుండటంతో కేంద్రం ఈ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓంబిర్లాలు సమావేశాలపై చర్చించినట్లు సమాచారం.
ఆన్లైన్కే మొగ్గు చూపుతున్నవెంకయ్య, ఓంబిర్లా
లోక్సభ రాజ్యసభల్లో సభ్యులు కచ్చితంగా సామాజిక దూరం పాటించాల్సి వస్తుంది. అలాంటప్పుడు అంతమంది సభ్యులకు హాల్ సరిపోతుందా అనేదానిపై సమీక్షిస్తున్నారు. లేదా ఇద్దరూ మరో ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ సారి పార్లమెంటు సమావేశాలను ఆన్లైన్లో నిర్వహించేందుకు వెంకయ్యనాయుడు, ఓంబిర్లాలు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమయంలో రిస్క్ తీసుకోకూడదని వారు భావించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం మరో రెండురోజుల్లో తెలుస్తుందని సమాచారం.
రాజ్యసభ ఎన్నికలకు ఈసీ కసరత్తు
ఇక కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడటంతో రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు కొత్త తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం. 17 రాష్ట్రాల్లో ఖాళీ అవబోతున్న 55 సీట్లకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ఎన్నికలు జరగాల్సిన రోజు మార్చి 18 నాటికల్లా 10 రాష్ట్రాల్లోని 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు తెలిపాయి. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మేఘాలయా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి.
జూన్ 19న ఎన్నికల నిర్వహణకు ఈసీ గ్రీన్ సిగ్నల్
ఇక ఈ రాష్ట్రాలకు జూన్ 19వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 22 జూన్ కల్లా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగియాలని ఈసీ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.