Rajya Sabha: 17 రాష్ట్రాల్లో 55 స్థానాలు ఖాళీ: ఎన్నికల షెడ్యూల్ ఇదే: పోలింగ్ ఎప్పుడంటే..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోలాహలం మరి కొద్దిరోజుల్లో ఆరంభం కానుంది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 17 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం 55 స్థానాల్లో ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల మొదలుకుని పోలింగ్ నిర్వహణ, నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వివరాలను షెడ్యూల్లో పొందుపరిచింది.
Rajya Sabha ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్..!
వచ్చేనెల 26న పోలింగ్..
కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికోసం వచ్చేనెల 6న నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 13. 16వ తేదీన వాటిని పరిశీలిస్తారు. దరఖాస్తులను ఉపసంహరించడానికి చివరి తేదీ 18. 26న పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీ నాటికి ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.
అత్యధికంగా మహారాష్ట్రలో ఖాళీలు..
మొత్తం 17 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న 55 మంది సభ్యుల పదవీ కాలం ముగియబోతోంది. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఏడుమంది పెద్దలు మాజీ కానున్నారు. ఒడిశా-4, తమిళనాడు-6, పశ్చిమ బెంగాల్-5, ఆంధ్రప్రదేశ్-4, తెలంగాణ-2, అస్సాం-3, బిహార్-5, ఛత్తీస్గఢ్-2, గుజరాత్-4, హర్యానా-2, జార్ఖండ్-2, మధ్యప్రదేశ్-3, రాజస్థాన్-3 ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల నుంచి ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది.
10 రోజుల వ్యవధిలో 55 మంది రిటైర్డ్..
మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఎంపికైన రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2న ముగియబోతోంది. 12వ తేదీన మేఘాలయ, మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారి పదవీ కాలం 9న ముగుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ ఎన్నికల ప్రకియను వచ్చేనెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా షెడ్యూల్ను రూపొందించింది.
డిగ్గీ రాజా సహా..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఈ 55 మందిలో ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన దిగ్విజయ్ సింగ్ పదవీ కాలం ఏప్రిల్ 9ను ముగియనుంది. ఆయనను మళ్లీ రీ నామినేట్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ మూడు స్థానాలు ఖాళీ కానుండగా.. డిగ్గీ రాజాను మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయి.