గత 70 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఆర్థిక మందగమనం లేదు: నీతిఆయోగ్
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటోందని ఇలాంటి పరిస్థితి గత 70 ఏళ్లలో ఎన్నడూ లేదని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విపత్కర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చెప్పారు.
మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందన్న రాజీవ్ కుమార్ గత 70 ఏళ్లల్లో భారత్ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనలేదని అన్నారు. ప్రైవేట్ రంగంలో రుణాలు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, అంతా డబ్బుపైనే ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు కొన్ని చర్యలు తప్పవని అన్నారు. పెద్ద నోట్ల రద్దు , జీఎస్టీలతో మొత్తం ఆర్థిక వ్యవస్థే మారిపోయిందన్నారు. అంతకుముందు 35శాతం మేరా నగదు చెలామణిలో ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అర్థం చేసుకున్న ప్రభుత్వం వాటిని ఆదుకున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రైవేట్ రంగంకు సంబంధించిన పెట్టుబడిదారులను ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని రాజీవ్ కుమార్ అన్నారు. ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జట్లో కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిందని గుర్తు చేసిన రాజీవ్ కుమార్... 2018-19లో ఆర్థిక వృద్ధి 6.8శాతానికి పడిపోయిందన్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో ఒడిదుడుకులు ఎదుర్కొనేందుకు మూలం మాత్రం 2009 నుంచి 2014 వరకు ఇచ్చిన రుణాలే కారణమన్నారు. ఇలా అడ్డదిడ్డంగా రుణాలు ఇవ్వడం వల్ల నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయాయన్నారు.
#WATCH: Rajiv Kumar,VC Niti Aayog says,"If Govt recognizes problem is in the financial sector... this is unprecedented situation for Govt from last 70 yrs have not faced this sort of liquidity situation where entire financial sector is in churn &nobody is trusting anybody else." pic.twitter.com/Ih38NGkYno
— ANI (@ANI) August 23, 2019
నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోవడంతో కొత్త రుణాలను బ్యాంకులు మంజూరు చేయలేకపోతున్నాయని రాజీవ్ కుమార్ చెప్పారు. ఇక పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ఐబీసీలు రావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అభిప్రాయపడ్డారు రాజీవ్ కుమార్. ప్రైవేట్ రంగాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన చెల్లింపులు సకాలంలో చేయకపోవడమే ఆర్థిక వ్యవస్థ మందగించేందుకు కూడా కారణం అవుతోందని అభిప్రాయపడ్డారు రాజీవ్ కుమార్.