భవిష్యత్పై భారీ ఆశలు రేకెత్తిస్తున్న ఆర్థికసర్వే.. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : 2018-19 ఆర్థికసర్వేను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక పరిస్థితులకు ఆర్థికసర్వే ప్రతిబింబించింది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి ప్రస్తావించారు.
7శాతం వృద్ధి..!
ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 7 శాతం ఉంటుందని ఆర్థికసర్వే అంచనా వేసింది. గతేడాది ఇది 6.8 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్, రుణ లభ్యత పెరగడంతో ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరగొచ్చని లెక్కగట్టింది. వ్యయం పెరగడం, ప్రైవేట్ పెట్టుబడు్లో వృద్ధి వల్ల జీడీపీ వేగంగా పెరుగుతుందని అంచనా వేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్తల మందగమనం, వాణిజ్య ఘర్షణలు పెరగడంతో ఈ ఏడాది ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.
టార్గెట్ 5 ట్రిలియన్ డాలర్లు..
2025 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే వృద్ధి రేటు ఇప్పటినుంచే 8 శాతం దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. చమురు ధరలు అందుబాటులో ఉండటంతో వినిమయ శక్తి పెరగవచ్చని పేర్కొంది పెట్టుబడుల రేటు 2011-12 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఊహించింది. గ్రామాల్లో వేతనాల్లో వృద్ధి కనిపిస్తోందని పేర్కొంది. వాస్తవానికి 2018 వరకు వీటి డెవలప్ ఆగిపోయిందని .. తర్వాత పెరుగుతూ వస్తోందని గుర్తుచేసింది.
కట్టడికి కసరత్తు ..!
వృద్ధిరేటు తగ్గడం, జీఎస్టీ, వ్యవసాయ పథకాల ఒత్తిడి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించిందని వివరించింది. ఎఫ్డీఐల నియంత్రణ తగ్గించేలా ప్రభుత్వ పాలసీలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది ద్రవ్యలోటు తగ్గి 5.8 శాతం ఉండొచ్చని .. అదే 2018లో 6.4శాతంగా ఉందని గుర్తుచేసింది. దీంతోపాటు మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం .. మూలధన వ్యయాల పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆర్థిక సర్వే రూపొందించేందుకు తమ బృందం అంకితభావంతో పనిచేసిందని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని .. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఆలోచనలను ఇచ్చే అవకాశం తమకు దక్కిందని పేర్కొన్నారు.