ఆసక్తికరం: ఆర్థిక సర్వేలో బాలీవుడ్ సినిమా డైలాగ్స్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ 2017-18 ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధి రేటు 7 నుంచి 7.5శాతం ఉండే అవకాశముందని సర్వేలో అంచనా వేశారు. ఇది ఇలా ఉంటే.. జీఎస్టీ నుంచి మొదలు కొని వ్యవసాయం, వాతావరణం.. ఇలా పలు అంశాలను ప్రస్తావించిన ఆర్థిక సర్వేలో బాలీవుడ్ సినిమాల్లోని ప్రముఖ డైలాగ్లు, పాటలు ఉపయోగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక సర్వేలో సుదీర్ఘమైన న్యాయ వ్యవస్థ ప్రక్రియ గురించి ప్రస్తావించినప్పుడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రముఖ డైలాగ్ 'తారీఖ్ పర్ తారీఖ్ (రోజులు రోజులు గడుస్తున్నా)'ను ఉపయోగించారు. సన్నీ డియోల్ నటించిన 'దామిని' చిత్రంలో ఒక సన్నివేశంలో కోర్టు తీర్పుతో ఉద్వేగానికి, అసహనానికి లోనైన సన్నీ.. తారీఖ్ పర్ తారీఖ్.. తారీఖ్ పర్ తారీఖ్ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ న్యాయవ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. ఈ డైలాగ్ను సర్వేలో ఉటంకించారు.
మరో సందర్భంలో మనోజ్ కుమార్ నటించిన 'ఉప్కార్' సినిమాలో పాటను ఉపయోగించారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం గురించి పేర్కొంటూ.. 'మేరే దేశ్ కి ధర్తీ సోనా ఉగ్లే ఉగ్లే హీరే మోటీ(నా దేశపు మట్టిలో పంటలు బంగారం, వజ్రం, ముత్యాల్లా పండుతాయి)' అని వివరించారు. దేశీయ వ్యవసాయ పరిస్థితుల గురించి ఈ పాటలో చక్కగా వర్ణించారని సర్వేలో తెలపడం గమనార్హం.