ఆర్థిక సర్వే 2017-18: వచ్చే ఏడాది వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం!
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ఆర్థిక సర్వే 2017-18ను ప్రవేశపెట్టారు. జీడీపీ వృద్ధి కోసం గత ఏడాది కాలం నుంచి అనేక సంస్కరణలు చేపట్టామని జైట్లీ తెలిపారు.
2017-18లో వృద్ధి రేటు 6.75 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.0 నుంచి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
త్రైమాసిక వృద్ధిరేటును పరిశీలిస్తే వార్షిక వృద్ధిరేటు మందగిస్తున్నట్లు కనిపించిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) కొత్త ఊపునిచ్చిందన్నారు. జీఎస్టీ అమలు తర్వాత పారిశ్రామిక వృద్ధిరేటులో కొంత మందగమనం ఉందన్నారు.
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో గణనీయంగా రాబడి పెరిగిందని తెలిపారు. వ్యవసాయేతర రంగాల్లో అనుకున్న దాని కన్నా ఉపాధి పెరిగిందని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారుల నమోదు శాతం పెరిగిందన్నారు.
ఇతర దేశాల కన్నా మన ఎగుమతులు బాగున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాల నుంచి విదేశీ ఎగుమతుల పెరుగుదల అధికంగా నమోదైందని జైట్లీ తెలిపారు. ఎగుమతుల్లో 70 శాతం మహారాష్ర్ట, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ నుంచే అని స్పష్టం చేశారు.
నోట్ల రద్దు వల్ల మదుపుదారుల సంఖ్య పెరిగిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. వస్ర్త పరిశ్రమ ప్రోత్సాహకాలతో రెడిమేడ్ దుస్తుల ఎగుమతులు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయ దిగుబడులపై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు.