పుంజుకున్న జీడీపీ వృద్ధి రేటు.. రెండో త్రైమాసికానికి 6.3 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: వరుసగా ఐదు త్రైమాసికాల నుంచి నెమ్మదిగా ఉన్న దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు తిరిగి పుంజుకుంది. ముగిసిన జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి జీడీపీ 6.3 శాతంగా నమోదైంది.
2016-17 సెప్టెంబర్ త్రైమాసికంలో 7.5 శాతంగా ఉన్న జీడీపీ 2017-18 తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయి 5.7 శాతంగా నమోదైంది. తాజాగా కేంద్ర గణాంకశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రెండో త్రైమాసికంలో తిరిగి 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.
తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, మంచినీటి సరఫరా, ట్రేడ్, హోటల్స్, రవాణా, సేవల రంగాల్లో వృద్ధిరేటు పెరిగింది. బ్లూమ్బెర్గ్ ఆర్థిక నిపుణుల సర్వే ప్రకారం జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతానికి చేరుతుందని అంచనా వేయగా 6.3 శాతంగా నమోదైంది.
ఇక ముగిసిన సెప్టెంబర్ త్రైమాసికానికి స్థూల విలువ జోడింపు(జీవీఏ) 6.1 శాతంగా నమోదైంది. త్రైమాసిక జీవీఏ ధరల ప్రాతిపదికన 2017-18 రెండో త్రైమాసికంలో తయారీ రంగం 7.0 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 7.7 శాతంగా ఉంది. మైనింగ్, క్వారియింగ్ రంగం 5.5 శాతానికి చేరింది. 2016-17 రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 1.3 శాతం తక్కువ.
గత ఏడాది కాలంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కొంతమేర ప్రభావాన్ని చూపాయి. దీంతో తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 5.7 శాతం నమోదైంది. సంస్కరణలు గాడిన పడటం, ప్రతిఫలాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తుండటంతో తాజాగా జీడీపీ వృద్ధిరేటు తిరిగి పుంజుకుంది.
రానున్నత్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు మరింత పెరుగుతుందని, జీఎస్టీ వల్ల నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా భారత్ వృద్ధిరేటు మెరుగవుతుందని భావిస్తున్నారు. భారత సార్వభౌమ రేటింగ్ను మూడీస్ పెంచటమే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6.7 శాతానికి.. 2018-19 నాటికి 7.5 శాతానికి వృద్ధిరేటు నమోదవుతుందని చెబుతున్నారు. వచ్చే కొన్నేళ్లలో భారత వృద్ధిరేటు 8 శాతం కాగలదని వాల్స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మెన్ శాచస్ అంచనా వేసింది.