ట్రబుల్స్లో ట్రబుల్ షూటర్: డీకేను అరెస్టు చేసిన ఈడీ..ఈయన్నైనా కాపాడుకోగలదా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు వరుసగా ఈడీ సీబీఐలకు టార్గెట్గా మారారు. కొద్దిరోజుల క్రితం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగా తాజాగా కర్నాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఈడీ వలకు చిక్కారు. కొద్ది రోజుల క్రితం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేయగా డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లి విచారణకు హాజరయ్యారు.
మంగళవారం డీకే శివకుమార్ను విచారణ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఈ కాంగ్రెస్ నేత మనీలాండరింగ్కు పాల్పడ్డారని చెబుతూ అరెస్టు చేసింది. నాలుగు రోజుల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత డీకే శివకుమార్ను ఈడీ అరెస్టు చేసింది. ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబరులో ఈడీ డీకే శివకుమార్తో పాటు కర్నాటక భవన్ ఉద్యోగి అయిన హనుమంతయ్యపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఐటీ శాఖ డీకే శివకుమార్పై చార్జ్షీట్ వేయడంతో దాన్ని ఆదారంగా చేసుకుని ఈడీ విచారణ చేసింది. డీకే శివకుమార్ పన్ను ఎగవేయడమే కాకుండా హవాలా ద్వారా కోట్లల్లో లావాదేవీలు జరిపినట్లు తాము గుర్తించినట్లు బెంగళూరు ప్రత్యేక కోర్టులో ఆదాయపు పన్ను శాఖ పిటిషన్ దాఖలు చేసింది.
Delhi: Ruckus outside the Enforcement Directorate (ED) office as supporters of Congress leader DK Shivakumar gather in large numbers. He has been arrested by the agency, under Prevention of Money Laundering Act (PMLA). pic.twitter.com/v7Kg7dm2IG
— ANI (@ANI) September 3, 2019
శివకుమార్ అతని సన్నిహితుడు ఎస్కే శర్మలు మరో ముగ్గురితో కలిసి హవాలా మార్గం ద్వారా పెద్ద ఎత్తున వివరాలు లేని నగదును రవాణా చేశారని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంటూ వీరందరిపై కేసు నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఐటీ ఈడీలు శివకుమార్ను వెంటాడుతున్నాయి. ఇక ముందస్తు అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ శివకుమార్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు ఊరట లభించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఈడీ ముందుకు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు.
ఇదిలా ఉంటే శివకుమార్ను ఈడీ అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆయన అభిమానులు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయంకు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.