inx medai case: చిదంబరం అరెస్ట్, ఇప్పుడు ఈడీ వంతు..
మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు సంబంధించి ఇవాళ ఉదయం తీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని ప్రశ్నించారు. చిదంబరంతోపాటు కార్తీ చిదంబరం, నళినిని కూడా అధికారులు విచారించారు. చిదంబరాన్ని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని, అవసరమైతే అరెస్ట్ చేసే వెసులుబాటు కల్పించాలని సీబీఐ కోర్టులో నిన్న ఈడీ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీకి ఎదురుదెబ్బ: చిదంబరం అరెస్టుపై ఆదేశాలు ఇవ్వని కోర్టు..రిజర్వ్
ఇదీ అభియోగం
యూపీఏ హయాంలో ఐఎన్ఎక్స్ మీడియాకు దొడ్డిదారిన నిధులు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఆర్థికమంత్రి పీ చిదంబరం ప్రోద్బలంతో అవకతవకలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జీ అప్రూవర్గా మారిన సంగతి తెలిసిందే. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా జైలు శిక్ష అనుభవించి.. బెయిల్పై బయట ఉన్నారు. ఈ కేసులో ఆగస్టు 21వ తేదీన పీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. ఆయన జ్యుడిషీయల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ఈడీ అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పుడు ఈడీ
ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని బుధవారం ఉదయం ప్రశ్నించింది. నగదు బదిలీపై ప్రశ్నించి.. అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. గురువారం సీబీఐ ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ కుహర్ వద్ద హాజరుపరుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరతామని పేర్కొన్నారు. కస్టడీకి తీసుకొని నగదు మళ్లింపులో జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రశ్నిస్తామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
కోర్టులో చుక్కెదురు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ను సవాల్ చేస్తూ చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అతను సాక్ష్యం మార్చలేడని.. కానీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తీహర్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు అతనికి ఇంటి ఆహారం ఇచ్చేందుకు మాత్రం హైకోర్టు అంగీకరించింది. ఇటీవల కడుపునొప్పి రావడంతో ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఇది సరికాదు
2007లో జరిగిన కేటాయింపులకు సంబంధించి 2017లో కేసు నమోదు చేయడం ఏంటి అని చిదంబరం, అతని లాయర్లు కపిల్ సిబాల్ తదితరులు న్యాయస్థానంలో వాదిస్తున్నారు. సీబీఐ జ్యుడిషీయల్ కస్టడీ ముగియడంతో ఈడీ రంగంలోకి దిగింది. అరెస్ట్ చేసి మేజిస్ట్రెట్ ముందు హాజరుపరుస్తోంది. మొత్తానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసు చిదంబరాన్ని నీడలా వెంటాడుతుంది. తొలుత సీబీఐ, తర్వాత ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోన్నాయి.