కార్తీ చిదంబరంకు ఈడీ షాక్: రూ. కోటికి పైగా ఆస్తుల అటాచ్
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్సెల్-మాక్సిస్ డీల్లో మనీ లాండరింగ్కు పాల్పడిన ఆరోపణలకు సంబంధించి కార్తీ చిదంబరానికి చెందిన రూ.1.16 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అటాచ్ చేసింది.
ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ల రూపంలో రూ.90 లక్షలు వరకూ అటాచ్ చేసినట్టు ఈడీ తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద వీటిని అటాచ్ చేస్తున్నట్టు ప్రొవిజినల్ అటాచ్మంట్ను జారీ చేసినట్టు తెలిపింది.
ఇదే చట్టం కింద అడ్వాటేంజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్సీపీఎల్)కు చెందిన మరో రూ.26 లక్షల డిపాజిట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.
ఏఎస్సీపీఎల్ సంస్థ మరో వ్యక్తి ద్వారా కార్తీ అధీనంలో ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. గుర్గావ్లో తనకు ప్రాపర్టీ ఉందని కార్తీ ఒప్పుకున్నారని, అటాచ్మెంట్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఆయన కొన్ని బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేసే ప్రయత్నాలు చేశారని కూడా ఈడీ ఆరోపిస్తోంది.