రూ.4,109 కోట్లు: హాయ్ల్యాండ్ సహా: అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్: అయిదు రాష్ట్రాల్లో: ఈడీ దెబ్బ
అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో కేసు దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఆరుమంది డైరెక్టర్లను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మరింత దూకుడును ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన 4,109 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారు. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో అగ్రిగోల్డ్కు చెందిన స్థిర, చరాస్తులను సీజ్ చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థలు, ప్లాంట్, మిషనరీలు ఇందులో ఉన్నాయి.
అలాగే- హాయ్ల్యాండ్కు చెందిన భూములను కూడా అటాచ్ కిందికి తీసుకొచ్చారు. ఈ అయిదు రాష్ట్రాల్లో మొత్తం 2,809 ల్యాండెడ్ ప్రాపర్టీని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఛైర్మెన్ సహా మొత్తం ఆరుమందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో అవ్వా వెంకట రామారవు, అవ్వా వెంకట శేషు నారాయణ రావు, అవ్వా హేమ సుందర వరప్రసాద్ ఉన్నారు. ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద వారిపై కేసు నమోదు చేశారు.
న్యాయస్థానం వారిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో అగ్రిగోల్డ్ యాజమాన్యం సుమారు 10 లక్షల మందిని మోసగించిందని నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ పోంజీ ఫ్రాడ్లో అగ్రిగోల్డ్ యాజమానులు మొత్తం 6,380 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు తేలింది. డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేసి.. ఆ డబ్బులతో సొంత ఆస్తులు కొనుగోలు చేయడానికి నకిలీ కంపెనీలను సృష్టించి, వాటికి నిధులు మళ్ళించారనే ఆరోపణలు అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఉన్నాయి.
ED attaches Haailand Amusement Park in Andhra Pradesh, shares of various companies, plant & machinery and 2,809 landed properties located in AP, Karnataka, Orissa, Telangana, TN, totalling to Rs 4,109 crores under PMLA in an agri gold ponzi fraud case: Enforcement Directorate
— ANI (@ANI) December 24, 2020
ఇందులో భాగంగా గుంటూరు సమీపంలో హాయ్ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్ను నిర్మించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 56 ఎకరాల హాయ్ల్యాండ్ ఆస్తులు కూడా తాజాగా జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. అగ్రిగోల్డ్ కుంభకోణంలో అరెస్టయిన డైరెక్టర్లను న్యాయస్థానం రిమాండ్కు పంపించింది. నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. 14 రోజుల రిమాండ్ సందర్భంగా.. నిందితుల నుంచి కీలక విషయాలను రాబట్టుకుంటారని అంటున్నారు. అయిదు రాష్ట్రాలతో పాటు మరెక్కడ వారికి ఆస్తులు ఉన్నాయనేది తెలుసుకుంటారని తెలుస్తోంది.