2జీ స్పెక్ట్రమ్ కేసు: తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాల్, ఏం జరగబోతోంది?
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేలుస్తూ గతేడాది డిసెంబరులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ 2జీ స్పెక్ర్టమ్ స్కాం చోటుచేసుకుంది. ఆ సమయంలో డీఎంకేకు చెందిన ఎ. రాజా టెలికాం శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆరోపించింది. ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది.
కాగ్ ఆరోపణలతో 2010లో ఎ. రాజాను అప్పటి యూపీఏ ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అనంతరం ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పొరేట్ సంస్థల అధికారులపై ఛార్జ్షీట్ దాఖలు చేశాయి. 2011లో రాజాను అరెస్టు కూడా చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు.
ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబరులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనూహ్య తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రాజా, కనిమొళితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. నిందితులపై ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఫలితంగా ఈ కేసు నుంచి వారంతా బయటపడ్డారు. అయితే తాజాగా ఈడీ ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయడంతో మళ్లీ ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.