బీఎస్పీ ఖాతాలో రూ.104కోట్లు డిపాజిట్: మాయావతికి ఈడీ షాక్
ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతికి గట్టి షాక్ తగలింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బీఎస్పీకి చెందిన ఒక బ్యాంకు ఖాతాలో రూ.104 కోట్ల నగదు జమ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు గుర్తించాయి.
అంతేగాక, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి సోదరుడైన ఆనంద్ ఖాతాలో రూ.1.43 కోట్లు వేశారని తేలింది. భారీమొత్తాల్లో జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కరోల్బాగ్ శాఖను ఈడీ అధికారులు యథాలాపంగా పరిశీలించారు. దీనిలో ఈ రెండు వివరాలు వెలుగుచూశాయి.
బీఎస్పీ ఖాతాలో జమ అయిన మొత్తంలో రూ.102 కోట్లు విలువైన 1000నోట్లే ఉన్నాయని తేలింది. రోజు విడిచి రోజు రూ.15-17 కోట్లు చొప్పున జమ చేస్తూ వచ్చినట్లు బయటపడింది.
ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించడంతో పాటు సీసీటీవీ దృశ్యాలు, కేవైసీ పత్రాలు వంటివి సమర్పించాల్సిందిగా బ్యాంకును ఈడీ కోరింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లధనం భారీగా బ్యాంకుల్లో చేరుతుండటం, మార్పిడి జరుగుతుండటంతో ఈడీ 50బ్యాంకు శాఖల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
ప్రతీ పైసకు లెక్కుంది: మాయావతి
తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఎస్పీ అధినేత్ర మాయావతి ఆరోపించారు. విరాళాల రూపంలో సేకరించిన డబ్బునే తమ పార్టీ అకౌంట్లో జమ చేశామని, తాము డిపాజిట్ చేసిన ప్రతి పైసకు లెక్కలున్నాయని చెప్పారు.
తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, చట్ట ప్రకారమే తన సోదరుడు బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేశాడని తెలిపారు. బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు ఇదొక నిదర్శనమని మాయావతి మండిపడ్డారు. దళితురాలిని కావడం వల్లే తనను దెబ్బతీసేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తమను బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో అనుభవిస్తున్న బాధలతో ప్రధాని మోడీపై జనాలు విశ్వాసం కోల్పోయారని, ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పుతారని అన్నారు.