మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతివ్వండి: ఈడీ
బ్యాంకుల దగ్గర భారీగా రుణాలు పొంది ఆపై ఎగవేసి పారిపోయిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్త చట్టం కింద లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తూ ఆయనకు చెందిన రూ.12500 కోట్లు ఆస్తులను జప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈడీ కోర్టును ఆశ్రయించింది. ముంబై కోర్టులో ఈడీ అధికారులు ఈ మేరకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. కొత్త చట్టం ప్రకారం రుణాలు పొంది ఆపై ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను జప్తు చేసేందుకు వీలుంది.
మాల్యా ఆస్తులను వెంటనే జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముంబై కోర్టులో ఈడీ అధికారులు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆధారాలను సైతం ఈ దరఖాస్తుకు ఈడీ జతపర్చింది. అయితే భారత్కు రప్పించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మాల్యా లండన్ కోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం ఉన్న మనీలాండరింగ్ చట్టం ప్రకారం విచారణ పూర్తిగా అయ్యాకే ఆస్తులను జప్తు చేసే వీలుంటుంది. అయితే విచారణ పూర్తయ్యేందుకు కొన్నేళ్ల సమయం పడుతుండటంతో కొత్త చట్టం ద్వారా మాల్యా ఆస్తులను జప్తు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఆర్థిక నేరగాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో అలాంటి వారిని కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. బ్యాంకుల వద్ద పెద్దమొత్తంలో రుణం పొంది ఆపై పలాయనం చిత్తగించేవారికోసం కఠిన నిబంధనలతో రూపొందించిన బిల్లును ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 12న లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే పార్లమెంటులో అప్పటికే చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లు చర్చకు రాలేదు. అనంతరం ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. దీంతో కేంద్రం ఆర్డినెన్స్గా తీసుకొచ్చి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఆయన ఆమోదముద్ర వేయడంతో చట్టంగా రూపాంతరం చెందింది.