కర్ణాటక మంత్రికి ఈడీ షాక్, ఎఫ్ఐఆర్, ఎప్పుడైనా అరెస్టు, సంకీర్ణ ప్రభుత్వం, హైకోర్టు!
బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ మీద ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మంగళవారం వెలుగు చూసింది. ఏ నిమిషంలో అయినా డీకే శివకుమార్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకు గురౌతున్నారు.
పెట్రోల్, డీజల్ ధరలు: కర్ణాటక ప్రజలకు గుడ్ న్యూస్, ప్రజల కోసం ప్రభుత్వం, సీఎం!
ఆదాయపన్ను శాఖ అధికారులు దాడుల నేపధ్యంలోనే వాటి వివరాలు తెలుసుకున్న ఈడీ అధికారులు మంత్రి డీకే. శివకుమార్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిసింది. మంత్రి డీకే. శివకుమార్ మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఏ సమయంలో అయినా ఆయన్ను విచారించే అవకాశం ఉంది.
మొత్తం ముగ్గురు
మంత్రి డీకే. శివకుమార్ తో పాటు మరో ఇద్దరి మీద ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక భవన్ మాజీ ఉద్యోగి రాజేంద్రన్, కర్ణాటక భవన్ ఉద్యోగి ఆంజనేయ హనుమంత్ అనే ఇద్దరు మంత్రికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
అరెస్టు భయం
అక్రమంగా డబ్బు సంపాధించారని ఆరోపిస్తూ మంత్రి డీకే. శివకుమార్ మీద ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ అధికారులు అరెస్టు చేస్తారని డీకే. శివకుమార్, ఆయన అనుచరులకు ఆందోళన మొదలైయ్యింది. అరెస్టు నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ మంత్రి డీకే శివకుమార్ న్యాయనిపుణలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
ఏం జరుగుతుంది ?
మంత్రి డీకే. శివకుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు ఢిల్లీ రావాలని సూచించే అవకాశం ఉంది. ఈడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేసి ముందస్తు జామీను ఇవ్వాలని మంత్రి డీకే. శివకుమార్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ఇంటిలో రూ. 8.59 కోట్లు
2017 ఆగస్టు 2వ తేదీన ఆదాయపన్ను శాఖ అధికారులు మంత్రి డీకే. శివకుమార్ కు చెందిన బెంగళూరు, ఢిల్లీలోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. అదే సందర్బంలో మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితులు రాజేంద్రన్, ఆంజనేయ హనుమంత్ ఇళ్లలో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు రూ. 8.59 కోట్లు గుర్తించారు.
లెక్కలు సరిపోలేదు
సోదాల్లో గుర్తించిన రూ. 8. 59 కోట్లకు లెక్కలు చూపించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంత్రి డీకే. శివకుమార్ కు సూచించారు. అయితే సరైన లెక్కలు లేకపోవడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఐటీ ఫిర్యాదుతో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి మంత్రి డీకే. శివకుమార్ ను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యింది.