చిక్కుల్లో చిద్దూ: లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ..ఏ క్షణమైనా అరెస్టు..?
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించగా... ఆ తర్వాత చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో కేసును టేకప్ చేసిన జస్టిస్ ఎన్వీ రమణ... ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పారు. అదే సమయంలో ఈ కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ బెంచ్కు పంపినట్లు జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
ఇక చిదంబరం కోసం సీబీఐలు ఈడీ అధికారులు వేటకొనసాగిస్తున్నారు. ఆయనకు సంబంధించిన నివాసాలకు వెళ్లి తనిఖీ చేశారు . అయితే ఎక్కడా చిదంబరం జాడ లేకపోవడంతో దేశం దాటే అవకాశం ఉందని అనుమానించిన ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో ఎటు చూసినా చిదంబరమే సూత్రధారిగా కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలోనే ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు జస్టిస్ సునీల్ గౌర్ నిరాకరించారు.
ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్పై అత్యవసర విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని బెంచ్ ముందుకు పిటిషన్ను తీసుకెళ్లాలని చిదంబరరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అయోధ్య కేసులో రోజువారీ విచారణ ప్రారంభించడంతో సిబల్ పిటిషన్ దాఖలు చేయలేకపోయారు. దీంతో చిదంబరాన్ని ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.