మానీలాండరింగ్ కేసు: కార్తీ చిదంబరంకు ఈడీ షాక్
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. 2జీ కుంభకోణంలో ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందంలోని మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది.
ఈ వారంలో కార్తీ చిదంబరం స్వయంగా లేదా తన ప్రతినిధి ద్వారా ఈడీ ముందు హాజరవ్వాలని.. వ్యక్తిగత ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, కంపెనీతో సంబంధం ఉన్న డాక్యుమెంట్లు తీసుకురావాలని ఈడీ ఆదేశించింది.
గత సంవత్సరం నుంచి మనీలాండరింగ్ కేసు విచారణ జరుగుతుండగా తొలిసారి ఈడీ.. కార్తీకి నోటీసులు పంపించింది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే ఈడీ, ఆదాయపన్ను శాఖ కార్తీ కంపెనీలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే.. తాను ఎలాంటి తప్పు చేయలేదని కార్తీ చిదంబరం చెబుతున్నారు. అయితే, కార్తీకి సంబంధించిన కంపెనీ నుంచి ఎయిర్సెల్ టెలివెంచర్స్కు అక్రమంగా నగదు బదిలీ అయినట్లు ఈడీ వెల్లడించింది. విదేశాల్లో పెట్టుబడులపై కూడా ఈడీ, సిబిఐ దర్యాప్తు నసాగిస్తోంది.