ఏంజరిగింది: ఈడీ అరెస్టు చేసి ఉంటే చిదంబరంకు తీహార్ జైలు గండం తప్పేదా?
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు మాజీ కేంద్రమంత్రి చిదంబరంను సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు జడ్జి. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఉద్దేశపూర్వకంగానే చిదంబరంను అరెస్టు చేయలేదని స్పష్టమవుతోంది. అందుకే చిదంబరం తీహార్ జైలుకు వెళ్లారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అరెస్టు చేసే అవకాశం ఉన్నా ఈడీ ఎందుకు చేయలేదు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరంమనీలాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ చెబుతోంది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును చిదంబరం ఆశ్రయించగా బెయిల్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ సమయంలో చిదంబరంను తమ కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈడీ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయలేదు. ఒకవేళ అరెస్టుకు అప్లికేషన్ కోర్టులో దాఖలు చేసి ఉంటే చిదంబరంను కచ్చితంగా ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చేది. దీంతో చిదంబరంకు తీహార్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.
ఆగష్టు 20 నుంచే చిదంబరం అరెస్టుకు యత్నిస్తున్న ఈడీ
ఈడీ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ కోసం చిదంబరం దరఖాస్తు చేసుకోగా ఢిల్లీ హైకోర్టు ఆగష్టు 20న తిరస్కరించింది. ఇక అప్పటి నుంచి విచారణ సంస్థ ఈడీ చిదంబరంను అరెస్టు చేసేందుకు ఉవ్విళ్లూరింది. కానీ గురువారం చోటుచేసుకున్న పరిణామాలతో అరెస్టు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈడీ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయలేదు. ఒకవేళ చిదంబరంను అరెస్టును కోరుతూ అప్లికేషన్ వేస్తే చిదంబరం తీహార్ జైలుకు వెళ్లకుండా బయటపడుతారని ముందే ఊహించింది ఈడీ. ఇక కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఈడీ అరెస్టు అప్లికేషన్ కోర్టుకు సమర్పించలేదు.
ఈడీకి సరెండర్ అవుతానన్న చిదంబరం
ఇదిలా ఉంటే చిదంబరం తన లాయరు కపిల్ సిబాల్ ద్వారా ఈడీకి సరెండర్ అవుతానంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ తరపున వాదనలు వచ్చేవారం వినిపిస్తానని సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. దీంతో చిదంబరం పెట్టుకున్న అప్లికేషన్పై కోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఇక గత 15 రోజులుగా చిదంబరంను విచారణ చేస్తున్న ఈడీ ఆయన్ను తీహార్ జైలుకు పంపాల్సిందిగా నొక్కి చెబుతోంది.
తీహార్ నుంచి బయటపడాలంటే ఈడీ కనికరించాలి
ఇక చిదంబరం సెప్టెంబర్ 19కంటే ముందుగా తీహార్ జైలునుంచి బయటపడాలంటే ఒకే మార్గం ఉంది. అది కూడా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ చిదంబరం అరెస్టును కోరుతూ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.అయితే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసేందుకు వారంకు పైగా ఈడీకి సమయం ఉంది. ఇదే సమయంలో చిదంబరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే బెయిల్ రావడం ఇప్పుడప్పుడే అంత ఈజీగా ఉండదు.