చిక్కుల్లో చిదంబరం: ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో చిద్దూ పేరు ఛార్జిషీట్లో చేర్చిన ఈడీ
న్యూఢిల్లీ: ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఆయన పేరును ఛార్జిషీటులో చేర్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఈడీ. మొత్తం ఈ కేసుకు సంబంధించి చిదంబరం, భాస్కరనన్తో పాటు 9 మంది పేర్లను ఛార్జిషీట్లలో చేర్చింది. ఈ ఛార్జ్షీట్ను నవంబర్ 26న ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ విచారణ చేయనున్నారు.
గ్లోబల్ కమ్యూనికేషన్ అండ్ హోల్డింగ్స్ అనే విదేశీ సంస్థ రూ.3,560 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 2006లో నాడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం అనుమతి ఇచ్చారని అయితే నిబంధనలను ఉల్లంఘించారని ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే రూ.1.16 కోట్లు తీసుకున్నట్లు ఈడీ ఛార్జిషీటులో పేర్కొంది. మనదేశంలో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఆర్థికశాఖ మంత్రికి రూ.600 కోట్లు కంటే ఎక్కువగా అనుమతి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు. అయితే చిదంబరం నిబంధనలను ఉల్లంఘించారని ఈడీ పేర్కొంది. అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో అనుమతులు ఇచ్చేముందు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందు ఉంచాలని అది చిదంబరం చేయలేదని ఈడీ వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఎఫ్డీఐని పెట్టుబడిగా చూపించినట్లు తమ విచారణలో వెల్లడైందని ఈడీ తెలిపింది. కేవలం రూ.180 కోట్లు పెట్టుబడిగా చూపించారని, కాబట్టి అది ఆర్థికవ్యవహారాల కేబినెట్ కమిటీ ముందు ఉంచాల్సిన అవసరం లేదనే తప్పుడు భావన సృష్టించారని ఈడీ వెల్లడించింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసుతో పాటు ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసును కూడా ఆరునెలల లోపు విచారణ పూర్తి చేయాలని ఈ ఏడాది మార్చి 12న సుప్రీంకోర్టు విచారణ సంస్థలైన ఈడీ సీబీఐలను ఆదేశించింది.