చందా కొచ్చర్.. వరుసగా నాలుగో రోజు: ఈడీ సంధిస్తోన్న ప్రశ్నలకు సమాధానాలేవీ?
ముంబై: దేశంలో సంచలనం రేపిన ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ రుణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. వరుసగా నాలుగోరోజు దర్యాప్తు కొనసాగిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్తోపాటు ఈ కేసులో క్విడ్ ప్రొ కోకు అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తున్న వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ లను సోమవారం ముంబైలోని తన కార్యాలయానికి పిలిపించింది. ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజైనప్పటికీ ఈడీ తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.
చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్ లతో పాటు మాట్రిక్స్ ఫర్టిలైజర్స్కు చెందిన నిషాంత్ కనోడియాను కూడా విచారించారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్సార్ గ్రూప్ వైస్ చైర్మన్ రవి రుయా అల్లుడు నిషాంత్. దీపక్ కొచ్చర్కు చెందిన నూపవర్ రెన్యువబుల్స్కు కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ మధ్య జరిగిన లావాదేవీల ఆరోపణలపై ఈడీ ఆరా తీస్తోంది. వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున రుణాలు మంజూరైన నేపథ్యంలో దీన్ని క్విడ్ ప్రొ కో కేసుగా ఈడీ విచారణ చేపట్టింది. 2010లో ధూత్కు చెందిన డొల్ల సంస్థల నుంచి నూపవర్కు 64 కోట్ల రూపాయల నిధులు బదలాయించినట్లు నిగ్గు తేల్చింది.
అదే సమయంలో మారిషస్ కేంద్రంగా పనిచేస్తున్న కనోడియా సంస్థ ఫస్ట్లాండ్ హోల్డింగ్స్ నుంచీ 325 కోట్ల రూపాయలు నూపవర్ కు బదలాయించినట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు. మొదట.. చందాకొచ్చర్, ఆమె భర్తకు సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు, ఆ వెంటనే వారికి సమన్లు జారీ చేశారు. శుక్రవారం నుంచి దర్యాప్తు కొనసాగుతోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసును ఈడీ నమోదు చేసినది తెలిసిందే.