జేకే క్రికెట్ అసోసియేషన్ స్కాం: ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ, కక్ష సాధింపేనని ఒమర్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ) కుంభకోణంకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శ్రీనగర్ కార్యాయలంలో ప్రశ్నించారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఫరూఖ్ అబ్దుల్లాతోపాటు మరో పది మంది జేసీసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ స్కాం వెలుగు చూసిన 2005-12లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ స్కాంలో కొన్ని కోట్ల గోల్మాల్ జరిగిందని పేర్కొంది.
ఫరూఖ్ అబ్దుల్లా జేకేసీఏ ఛైర్మన్గా ఉన్న 2002-2011 కాలంలో బీసీసీఐ.. జమ్మూకాశ్మీర్లో క్రికెట్ అభివృద్ధికి సుమారు రూ. 113 కోట్లు ఇచ్చింది. అయితే, ఈ మొత్తంలో నుంచి రూ. 43.69 కోట్లను పక్కదారి పట్టించిన ఫరూక్ సహా నిందితులు దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే, ఫరూఖ్ అబ్దుల్లాతో మరో ఐదుగురిపై ఛార్జీషీటు నమోదు చేయడంలో సీబీఐ విఫలమైన నేపథ్యంలో.. ఈ మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.
కాగా, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఫరూఖ్ అబ్దుల్లాను ఈడీ విచారిస్తోందని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పార్టీలు కూటమిగా ఏర్పడటంతోనే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈడీ సమన్లపై తమ పార్టీ స్పందిస్తుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరుతూ ఫరూక్ అబ్దుల్లా నివాసంలో ఇటీవల ఆరు పార్టీల నేతలు సమావేశమైన విషయం తెలిసిందే. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సజద్ లోన్, పీపుల్స్ మూవ్ మెంట్ నేత జావేద్ మిర్, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ముపఫర్ షా పాల్గొన్నారు.
కాగా, ఇటీవల ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్మూకాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తొలగించడానికి తాము చైనా సాయం తీసుకుంటామని అన్నారు. సరిహద్దు వివాదాలకు కారణమై, మన జవాన్ల ప్రాణాలు తీస్తున్న చైనా సాయం కోరడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ద్రోహి అంటూ ఫరూక్పై మండిపడ్డారు.