ఫెమా ఉల్లంఘనలు: నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. విదేశీ మారక చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన కేసులో ఈడీ ఈ మేరకు సోదాలు నిర్వహించింది.
విదేశీ మారక చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ప్రకారమే తాము ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సంపాదించేందుకే ఈ దాడులు చేసినట్లు చెప్పారు.
ముంబై, ఢిల్లీలోని నరేశ్ గోయల్ నివాసాలపై దాడులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల్లో అవకతవకలు, భారీగా నిధుల మళ్లింపు చోటు చేసుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ నివేదికలోనూ వెల్లడైంది. జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ఛైర్మన్ గా ఉన్న నరేశ్ గోయల్ ఈ ఏడాది మార్చిలో సంస్థ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ దివాళా ప్రక్రియలో ఉంది.