మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు -ప్రశ్నించినందుకు కేంద్రం ప్రతీకారమన్న పీడీపీ చీఫ్
జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి, ఒకప్పటి బీజేపీ మిత్రురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులు పంపింది.
ఈడీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులో ప్రశ్నించేందుకు మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేశారు. మార్చి 15న న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆమెను కోరారు.
జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత మెహబూబా ముఫ్తీ దాదాపు ఓ సంవత్సరంపాటు నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఈడీ సమన్లపై ఆమె ఘాటుగా స్పందించారు. ''భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. కానీ ఇవేం పని చేయవు'' అంటూ ట్వీట్ చేశారు.
జమ్మూకాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి,ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది. జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది.