శిల్పాశెట్టి భర్తకు ఈడీ ఝలక్.. రాజ్ కుంద్రాకు మెడకు ‘మిర్చి’ ఉచ్చు!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాకు ఎదురుదెబ్బ తగిలింది. గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చితో సంబంధాల నేపథ్యంగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. దీంతో ఆయన మెడకు ఈ కేసు ఉచ్చు గట్టిగానే బిగిసే అవకాశం ఉందనే మాట రాజకీయ, వ్యాపార వర్గాల్లో వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..
విచారణకు హాజరుకావాలని
మనీలాండరింగ్ కేసులో విచారణను వేగవంతం చేసిన అధికారులు రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేశారు. ఈడీ అధికారి ముందు విచారణకు హాజరుకావాలని సోమవారం ఆదేశించారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద విచారణ చేపట్టాం అని అధికారులు వెల్లడించారు.
అక్రమ ఆర్థిక లావాదేవీలపై
మనీలాండరింగ్ కేసులో రంజిత్ బింద్రాతో జరిపిన ఆర్థిక లావాదేవీలను ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ కేసులో బాస్టియన్ హాస్పిటాలిటీ వ్యవహరంతో సంబంధించిన అంశాలపై అధికారులు దృష్టిపెట్టారు. రంజిత్ బింద్రాతో కొనసాగిన ఆర్థిక వ్యవహారాల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది. వాటి వివరాలు సేకరించేందుకు రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేశాం అని అధికారులు తెలిపారు.
ఆరోపణల నేపథ్యంలో రాజ్ కుంద్రా
ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ భావించింది. ఈ వ్యవహారంలో మిర్చిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో గుండెపోటుతో మిర్చి మరణించాడు. ఇక మనీలాండరింగ్ కేసులో పలు ఆర్థిక అంశాల్లోని అవకతవకల నేపథ్యంలో రంజిత్ బింద్రాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు.
ఈడీ మెరుపు దాడులు
గత కొద్దికాలంగా ఈడీ అధికారులు రాజ్ కుంద్రా, రంజిత్ బింద్రాకు సంబంధించిన వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నది. పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గత కొద్ది నెలలుగా పలుమార్లు మెరుపు దాడులు చేసి కీలకమైన సమాచారాన్ని సొంతం చేసుకొన్నది. ఇక ఈ కేసులో రాజ్ కుంద్రా నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది.