ట్రబుల్ షూటర్ విచారణ, అన్నీ మోడీనే చేస్తారా ? అవినీతి అంటే ఇంతే, బళ్లారి శ్రీరాములు !
బెంగళూరు: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే డీ.కే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ చేస్తున్న సందర్బంగా కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బళ్లారి శ్రీరాములు స్పందించారు. తప్పు చేసిన వారు ఈ రోజు కాకుంటే రేపైనా శిక్ష అనుభవించాలని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. ప్రతి విషయం ప్రధాని నరేంద్ర మోడీకి ముడిపెట్టడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయిందని మంత్రి బళ్లారి శ్రీరాములు ఆరోపించారు.
బళ్లారిలో నువ్వానేనా !
బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల సందర్బంగా డీకే. శివకుమార్, బళ్లారి శ్రీరాములు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. బళ్లారిలో నువ్వానేనా అంటూ పోటాపోటీ ప్రచారం చేశారు. ఆ సందర్బంలో శ్రీరాములు తనకు అన్నతో సమానం అంటూ డీకే. శివకుమార్ స్థానికులకు చెప్పారు. ఆ సమయంలో బళ్లారి శ్రీరాములు, డీకే. శివకుమార్ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకున్నారు.
ఒక్కడి సమస్య కాదు !
డీకే. శివకుమార్ ను మాత్రమే ఈడీ అధికారులు విచారణ చెయ్యడం లేదని శ్రీరాములు అన్నారు. దేశంలో చాల మందిని ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారని, చాల ఉదాహరణలు ఉన్నాయని శ్రీరాములు చెప్పారు. చట్టానికంటే ఎవ్వరూ గొప్పవాళ్లు కాదని, చట్టం ముందు అందరూ సమానమే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని శ్రీరాములు అన్నారు.
అవినీతి, హవాలా అంటే ఇంతే !
అవినీతి, హవాలా రాకెట్, అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే ఈ రోజు కాకపోతే రేపైనా చట్టం ముందు నిలబడాలని, అప్పుడు అధికారులు వారిని విచారణ చేస్తారని బళ్లారి శ్రీరాములు అన్నారు. ఉప్పు తిన్న తరువాత తప్పకుండా నీళ్లు తాగాలనే సామెతను బళ్లారి శ్రీరాములు గుర్తు చేశారు.
అన్నీ మోడీనే చేస్తారా ?
ఇంతకు ముందు ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడి చేసిన సమయంలో అధికారుల ముందే డీకే. శివకుమార్ కొన్ని డాక్యుమెంట్లు చింపేశారని బళ్లారి శ్రీరాములు గుర్తు చేశారు. ఐటీ అధికారులు, ఈడీ అధికారులు విచారణ చెయ్యడానికి సమన్లు జారీ చేస్తే అందుకు ప్రధాని నరేంద్ర మోడీనే కారణం అని ఆరోపించడం సరికాదని శ్రీరాములు అన్నారు.
బినామీ ఆస్తులు !
బినామీ ఆస్తులు సంపాధించారని వెలుగు చూస్తే డీకే. శివకుమార్ కేసులో చిక్కుకుంటారని, అధికారుల విచారణలో ఆయన తప్పు చెయ్యలేదని వెలుగు చూస్తే ఆయన కచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారని కర్ణాటక మంత్రి బళ్లారి శ్రీరాములు చెప్పారు.
రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు !
రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు అని మంత్రి బళ్లారి శ్రీరాములు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఏం జరగాలో అదే జరుగుతుంది, వ్యాపారంలో ఏం చెయ్యలో అదే చేస్తారని, ఒకదానికి ఒకటి ముడి పెట్టడం మంచిది కాదని మంత్రి బళ్లారి శ్రీరాములు కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని మంత్రి బళ్లారి శ్రీరాములు ఆరోపించారు.