ఇక అహ్మద్ పటేల్ వంతు: సందేసర స్కాంలో విచారించేందుకు ఇంటికి ఈడీ, రూ.15 వేల కోట్ల స్కాం..
కేంద్ర మాజీమంత్రి చిదంబరం తర్వాత కేంద్ర ప్రభుత్వం సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్పై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ్ కేసులో విచారించేందుకు ఈడీ అధికారులు అహ్మద్ పటేల్ నివాసానికి చేరుకున్నారు. ఈ స్కాంలో రూ.15 వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కేసులో ఇదివరకు కూడా పటేల్ను ప్రశ్నించాలని అనుకొంది. కానీ అనారోగ్య కారణాల వల్ల వీలుకాలేదు. కానీ ఇవాళ మరోసారి అధికారులు రావడంతో ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు తాను 60 ఏళ్లు పైబడిన వ్యక్తినని.. కరోనా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని పటేల్ తెలిపారు.
కేసులో ఇదివరకు పటేల్ కుమారుడు ఫైసల్, అల్లుడు సిద్దిఖీని విచారించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా నితిన్ సందేసర ప్రమేయం ఉంది అని తెలుసుకున్నారు. పీఎన్బీ స్కాం కంటే సందేసర స్కాం పెద్దదని ఈడీ అధికారులు తెలిపారు. ఎస్బీఎల్, సందేసర గ్రూపు ప్రమోటర్లు నితిన్ సందేసర, చేతన్ సందేసర, దీప్తి సందేసర కలిసి బ్యాంకుల నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకున్నారని తెలిపారు.
Recommended Video
2017లో సందేసర గ్రూపు చేసిన స్కాం వెలుగుచూసింది. కంపెనీకి చెందిన ఒకరినీ ఈడీ అరెస్ట్ చేయడంతో కుంభకోణం బయటపడింది. ఈడీ అధికారులు స్టేట్మెంట్ తీసుకొని, పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు సందేసర.. అహ్మద్ పటేల్ కుమారుడు, అల్లుడు నివాసాలకు భారీ నగదుతో వచ్చారని తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేతలకు కుంభకోణంతో సంబంధం ఉంది అని ఈడీ అభియోగాలు మోపింది. అయితే ఆరోపణలను అహ్మద్ పటేల్ తొలి నుంచి ఖండిస్తున్నారు. సందేసర గ్రూపునకు చెందిన సునీల్ యాదవ్.. సిద్దిఖీ, ఫైసల్ పటేల్కు సందేసర కోడ్ ఇచ్చారని.. ఈడీ అధికారులు తెలిపారు.