చిదంబరం నివాసానికి చేరుకుంటున్న కాంగ్రెస్ సీనియర్లు.. పోలీసుల సాయం కోరిన సీబీఐ
Recommended Video
ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఎట్టకేలకు ఆజ్ఞాతం వీడి ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు అంశాలు ప్రస్తావించారు. అసలు ఐఎన్ఎక్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆయన కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్నారనే సమాచారం మేరకు సీబీఐ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వారిని లోనికి రానివ్వకపోవడంతో హైడ్రామా నెలకొంది.
చిదంబరం ఇంటిముదు హైడ్రామా, గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు
అక్కడినుంచి చిదంబరం నేరుగా జోర్ బాగ్లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు. అదే సమయంలో రెండు సీబీఐ బృందాలు ఆయన నివాసానికి చేరుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం కూడా అక్కడకు చేరుకుంది. అయితే సీబీఐ బృందాలు లోనికి రాకుండా చిదంబరం ఇంటి గేట్లు మూసివేశారు. కొద్దిసేపు వేచి చూసిన సీబీఐ అధికారులు చివరకు గేట్లు దూకి లోనికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే చిదంబరంకు మద్దతుగా పెద్దసంఖ్యలో కాంగ్రెస్ సీనియర్లు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. అదలావుంటే సీబీఐ అధికారులు ఢిల్లీ పోలీసుల సాయం కోరారు. మొత్తానికి సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకోవడంతో హైడ్రామా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.