ఇక రాజ్థాక్రే వంతు: ఈడీ ఉచ్చులో ఎంఎన్ఎస్ అధినేత...ముంబైలో 144 సెక్షన్
ముంబై: ముంబైలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. మరికాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు మహారాష్ట్ర నవనిర్మాణసేన పార్టీ అధినేత రాజ్థాక్రేను ప్రశ్నించనున్న నేపథ్యంలో అక్కడికి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ముంబై పోలీసులు పరిసరప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. ఇప్పటికే సంయమనం పాటించాలని రాజ్థాక్రే పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబైలోని ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు చెప్పారు.
ముంబైలో ఈడీ జోన్లు 12 ఉండగా అన్ని చోట్లా గట్టి నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలపై ఓ కన్నేసి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఇక కొందరిని ముందుగానే గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా అరెస్టు అయిన వారిలో ఎమ్ఎన్ఎస్ నేత సందీప్ దేశ్పాండే కూడా ఉన్నాడు. ఆయన్ను శివాజీ పార్కు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజ్థాక్రే నివాసం దగ్గర పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్థాక్రే ఇచ్చిన పిలుపుమేరకు తామంతా ఎంతో సంయమనం పాటిస్తున్నట్లు కార్యకర్తలు చెప్పారు. అయితే పోలీసులు మాత్రం ముందుగానే తమ వారిని అరెస్టు చేసి తమను రెచ్చగొడుతున్నారని ఎమ్ఎన్ఎస్ నేత సంతోష్ ధూరి చెప్పాడు. ఇక రాజ్థాక్రే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ముందు ఉదయం 10:30 గంటలకు హాజరు అవుతారు. ఐఎల్&ఎఫ్ఎస్కు సంబంధించిన పెట్టుబడులు కోహినూర్ సీటీఎన్ఎల్లోకి ఎలా వెళ్లాయనేదానిపై ఈడీ రాజ్ థాక్రేను ఆరా తీస్తోంది. రాజ్థాక్రేకంటే ముందు ఆయన పార్ట్నర్లు అయిన ఉన్మేష్ జోషి, రాజేంద్ర శిరోద్కర్లను ఈడీ ప్రశ్నించింది.