కర్ణాటకలోనూ టీవీ9పై బ్యాన్: కెసిఆర్ లాగే సిద్ధరామయ్య
బెంగళూరు: టీవీ9 చానెల్కు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి జోక్యం చేసుకోవాలని కోరడానికి కన్నడ టీవీ చానెల్స్ సంపాదకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రహస్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే సోమవారం గంటల కొద్ది తమ ప్రసారాలను నిలిపేశారని టీవీ9 ఆరోపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ బలమైన మంత్రి ప్రమేయం కారణంగానే సోమవారం రాత్రి తమ చానెల్ ప్రసారాలను నిలిపేశారని టీవీ9 చానెల్ అధికారులు ఆరోపించారు. ప్రైమ్ టైమ్ సెగ్మెంట్లో సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కథనాన్ని ప్రసారం చేయాల్సి ఉండిందని వారన్నారు.
సంపాదకులతో జరిగిన సమావేశం నుంచి బయటకు వస్తూ - ఈ వివాదంతో తమకు ఏ విధమైన సంబంధం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఆ వివాదం చానెల్ యాజమాన్యానికీ కేబుల్ ఆపరేటర్లకూ మాత్రమే సంబంధించిందని ఆయన చెప్పారు.
తమకు ఏ విధమైన సంబంధం లేనప్పటికీ చర్చల కోసం కేబుల్ ఆపరేటర్లను చర్చలకు ఆహ్వానించినట్లు, సమస్య పరిష్కారానికి వారిని చర్చలకు ఆహ్వానించినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్ చెప్పారు. కార్యక్రమం ప్రసారం చేయాల్సిన సమయంలో పలువురు కేబుల్ ఆపరేటర్లు బహిష్కరించారని చానెల్ వర్గాలు చెప్పాయి.
కొద్ది రోజుల క్రితం ఇంధన శాఖ మంత్రి డికె శివకుమార్ కేబుల్ ఆపరేటర్లతో సమావేశమయ్యారని, టీవీ 9, న్యూస్9 చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారని చానెల్ ఓ ప్రకటనలో ఆరోపించింది. ఆ రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపేయకపోతే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా మంత్రి హెచ్చరించారని ఆ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకే ప్రసారాలను నిలిపేశామని చానెల్ ఆరోపణను కర్ణఆటక రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు పాట్రిక్ రాజు ఖండించారు.
కొన్నాళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోనూ టీవీ9 ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకే ప్రసారాలను నిలిపేశారని ఆ చానెల్ ఆరోపించింది. అయితే, తమకేమీ సంబంధం లేదని, అది కేబుల్ ఆపరేటర్లకు మాత్రమే సంబంధించిందని కెసిఆర్ చెబుతూ వచ్చారు. అలాగే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అక్కడి వివాదం విషయంలో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకు హ్యాత్వే తెలంగాణలో టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించింది.