ట్రెండ్ అయింది, అలా చేస్తే రేప్ అనరు: హైకోర్టు సంచలనం
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే అత్యాచారం కిందికి రాదని బొంబాయి కోర్టు సంచలన వ్యాఖ్య చేసింది.
ముంబై: పెళ్లిచేసుకుంటానని హామీ ఇవ్వడడం ప్రలోభపెట్టడం కిందకి రాదని, ప్రతి రేప్ కేసుకు ఇది వర్తించదని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. 21 యేళ్ల యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, ఆ తర్వాత వదిలేశాడంటూ అతడిపై ఓ యువతి రేప్ కేసు పెట్టింది. దీంతో ఆ యువకుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
అతడి ముందస్తు బెయిల్కు అంగీకరిస్తూ జస్టిస్ మృదుల భట్కర్ ఆ విధంగా వ్యాఖ్యానించారు. ప్రేమించుకున్న జంటలు విడిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తిపై రేప్ కేసు పెట్టడం ఓ ధోరణిగా మారిపోయిందని, అయితే కోర్టులు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
బాధితురాలి బాధలు, నిందితుడి జీవితం, స్వేచ్ఛ - ఈ రెండిటి మధ్య కోర్టులు సమతుల్యం సాధించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెళ్లికంటే ముందు తమ అంగీకారంతోనే జరిగిన శృంగారాన్ని చదువుకున్న ఆడపిల్లలెవరూ రేప్ అనరని, తద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి ముందే తెలుసు కాబట్టి ఎవరి నిర్ణయానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
సమాజం మారుతోందని, పెళ్లి చేసుకునే వరకు మహిళ యువతిగా కన్యగా ఉండాలనే అభిప్రాయం ఉండేదని, ప్రస్తుతం యువతరం పరస్పరం విభిన్నమైన కలయికలోకి వస్తున్నారని, వారికి లైంగిక చర్యగా గురించి బాగా తెలుసునని అన్నారు. చదువుకున్న అమ్మాయి పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే అది అంగీకారంతోనే జరిగి ఉంటుందని అన్నారు.