రూ. 500 కోట్లు డీల్, ఎన్ కౌంటర్, కేసు సీఐడీకి, పంజాబ్ టూ మైసూర్, పెద్దనోట్లు మార్పిడి !
బెంగళూరు: మైసూరు నగరంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల మీద ఆరోపణలు రావడంతో కేసును సీఐడికి అప్పగిస్తూ కర్ణాటక డీజీపీ నిలమణి రాజు ఆదేశాలు జారి చేశారు. ఎన్ కౌంటర్ కు గురైన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖిందర్ సింగ్ (40) కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. నిందితుడు సుఖ్విందర్ సింగ్ రద్దు అయిన పెద్దనోట్ట మార్పిడి ముఠా నాయకుడు అని పోలీసులు అంటున్నారు.
మైసూరు నగరంలోని విజయనగర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ బి.జి. కుమార్ సుఖ్విందర్ సింగ్ ను ఎన్ కౌంటర్ చేశారు. పంజాబ్ లోని ఫరిదాకోట్ నివాసి సుఖ్విందర్ సింగ్. ఇన్స్ పెక్టర్ బి.జి. కుమార్ కథనం మేరకు చైన్ స్నాచింగ్ లు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు గస్తి తిరుగుతున్నారు.
మైసూరుకు చెందిన ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు ఇన్స్ పెక్టర్ కుమార్, ఏఎస్ఐ, ఇద్దరు పోలీసులు రింగ్ రోడ్డులోని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లారు. సుమారు రూ. 500 కోట్ల రద్దు అయిన రూ. 1,000, రూ. 500 నోట్లు మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ఫార్మర్ సమాచారం ఇచ్చాడని ఇన్స్ పెక్టర్ కుమార్ అంటున్నాడు.
సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితులు ఉన్న కారును చుట్టుముట్టారు. ఆ సమయంలో నిందితుడు సుఖ్విందర్ సింగ్ పోలీసుల మీద కాల్పులు జరిపడానికి ప్రయత్నించాడని సమాచారం. ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం తాను కాల్పులు జరిపడంతో సుఖ్విందర్ సింగ్ మరణించాడని ఇన్స్ పెక్టర్ కుమార్ విజయనగర పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మైసూరుకు చెందిన వ్యాపారవేత్తకు సుఖ్విందర్ సింగ్ రూ. 10 లక్షలు మోసం చేశాడని పోలీసులు అంటున్నారు. సుఖ్విందర్ సింగ్ తో కలిసి కారులో ఉన్న ఇద్దరు నిందితులు పరారైనారు. పరారైన నిందితుల్లో ఒకరు బెంగళూరు నివాసి అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పరారైన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు రిసార్టులు, హోటల్స్ లో గాలిస్తున్నారు.