మూడోరోజు: బోరుబావిలోనే బాలుడు..ప్రే ఫర్ సుజిత్!
చెన్నై: వంద అడుగుల పైనే ఉన్న ఓ బోరుబావిలో రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ పడిన ఘటన ఆదివారం నాటితో మూడో రోజుకు చేరుకుంది. సుజిత్ విల్సన్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ తమిళనాడు మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రే ఫర్ సుజిత్, సేవ్ సుజిత్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాకు కుదిపేస్తోంది. సుజిత్ ను కాపాడటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ.. అవి సఫలం కావట్లేదు. వాతావరణం అనుకూలించకపోవడం కూడా దీనికి ఓ కారణమౌతోంది. కంటి మీద కునుకు లేకుండా అధికార యంత్రాంగం సుజిత్ ను సజీవంగా వెలకి తీయడానికి శ్రమిస్తోంది.
రెండు రోజుల కిందటి నుంచీ బోరుబావిలో..
శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో తన తండ్రికి చెందిన మొక్క జొన్న పొలంలో ఆడుకుంటూ దురదృష్టవశావత్తూ సుజిత్ బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపంలోని నడుకట్టుపట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యరాజ్, కళైరాణిల రెండో కుమారుడు సుజిత్ విల్సన్. ఆరోగ్యరాజ్ కు నాలుగెకరాల పొలం ఉంది. అందులో మొక్కజొన్నను పండిస్తున్నాడు. నీరు పడకపోవడంతో ఖాళీగా వదిలేసిన బోరుబావిలో సుజిత్ పడిపోయాడు. ఆ బోరుబావి లోతు సుమారు వంద అడుగుల పైమాటే. ప్రారంభంలో 25 అడుగుల లోతులో సుజిత్ చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 60 అడుగుల కిందికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
నిర్విరామంగా శ్రమిస్తున్నా..
సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆదివారం తెల్లవారు జామున బోర్ వెల్స్ యంత్రాలను తెప్పించారు. వాటి సహాయంతో బోరుబావికి సమాంతరంగా రంధ్రాన్ని వేస్తున్నారు. బోరు వేసే చర్యల వల్ల భూమి కదిలి పోవడంతో సుజిత్.. మరింత లోతుకు దిగజారినట్లు నిర్ధారించారు. సమీప ఆసుపత్రుల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించారు. నిరంతరాయంగా ఆక్సిజన్ ను బోరుబావిలోకి పంపిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి బాలుడి నుంచి కదలికలు లేవనే విషయం వారిని కలిచి వేస్తోంది.
విషాదంలో సుజిత్ కుటుంబం..
ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకోవడంతో సుజిత్ తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడు ప్రాణాలతో జీవించి ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. జాతీయ వైపరీత్యాల నిర్వహణ బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ.. చిన్నారి సుజిత్ ను అందుకోలేకపోతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ ఘటన పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. సుజిత్ ప్రాణాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నారు.
స్పందిస్తోన్న కోలీవుడ్..
తమిళనాడు చిత్ర పరిశ్రమ ఈ ఘటనపై స్పందించింది. రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్, విశాల్, కార్తి, అజిత్ వంటి ప్రముఖులు సేవ్ సుజిత్, ప్రే ఫర్ సుజిత్ హ్యాష్ ట్యాగ్ లతో తమ సందేశాలను వ్యక్తం చేస్తున్నారు. బోరుబావిలో పడ్డ చిన్నారులను ఆదుకోలేకపోవడం కలచి వేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రుడి మీదికి రాకెట్లను పంపించడమే కాదు.. భూమిలో ఓ 20 అడుగుల లోతున చిక్కుకున్న చిన్నారులను కాపాడలేకపోతున్నామని, దీనికి అవసరమైన పరిజ్ఞానాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. ఈ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.